Begin typing your search above and press return to search.

పూరి కూతురు క్లారిటీ ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Aug 2018 6:57 AM GMT
పూరి కూతురు క్లారిటీ ఇచ్చేసింది
X
సినిమా పరిశ్రమలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వ సాదారణం. హీరో - దర్శకుడు - నిర్మాత - హీరోయిన్‌ ఇలా ప్రతి ఒక్క వారసులు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎక్కువ శాతం హీరోలు వారసులు అని చెప్పుకోవచ్చు. హీరోయిన్స్‌ విషయంలో మాత్రం వారసత్వం కాస్త తక్కువ. బాలీవుడ్‌ లో వారసులుగా వచ్చిన హీరోయన్స్‌ కాస్త ఎక్కువగానే ఉన్నారు. కాని టాలీవుడ్‌ లో మాత్రం హీరోయిన్స్‌ గా వారసులు ఎంట్రీ తక్కువ అని చెప్పాలి. మోహన్‌ బాబు కూతురు మంచు లక్ష్మి నటిగా మాత్రమే పరిచయం అయ్యింది. ఆ తర్వాత నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది, కాని సక్సెస్‌ కాలేక పోయింది. ప్రస్తుతం రాజశేఖర్‌ పెద్ద కూతురు శివాని హీరోయిన్‌ గా 2 స్టేట్స్‌ అనే చిత్రం చేస్తోంది. ఆ తర్వాత ఆయన చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్‌ గా పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే దారిలో పూరి జగన్నాద్‌ కూతురు పవిత్ర కూడా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

డాషింగ్‌ డైరెక్టర్‌ గా పూరి జగన్నాధ్‌ మంచి క్రేజ్‌ ను దక్కించుకున్నాడు. ఆయన కొడుకు ఆకాష్‌ మరియు కూతురు పవిత్రను చిన్నతనం నుండే సినిమాల్లో నటింపజేశాడు. తాజాగా కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా పరిచయం అయ్యాడు. ఇదే సమయంలో పవిత్రను కూడా పూరి హీరోయిన్‌గా తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయమై పవిత్ర క్లారిటీ ఇచ్చింది. తాను హీరోయిన్‌ గా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనకు హీరోయిన్‌గా చేయాలనే ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చింది. తనకు నిర్మాణంపై ఆసక్తి ఉందని, చదువు పూర్తి చేసిన తర్వాత సినిమా ప్రొడక్షన్‌ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. నన్ను హీరోయిన్‌గా పరిచయం చేయాల్సిందిగా ఇద్దరు దర్శకులు అమ్మను పదే పదే కోరారు అంటూ పవిత్ర చెప్పుకొచ్చింది.

తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌ గా రాణించలేరు. ఈ విషయం గతంలో పలువురి విషయంలో జరిగింది. అందుకే పవిత్ర ముందు జాగ్రత్తతో హీరోయిన్‌ గా పరిచయం కావద్దని భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిర్మాణ రంగంలో తన సత్తా చాటి, ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా నటిగా అవకాశాలు వస్తే అప్పుడు చూస్తాను అంటూ చెబుతుంది. మొత్తానికి పవిత్ర భవిష్యత్తు గురించి మంచి ప్లానింగ్‌ తో ఉంది. ఇప్పటికే వచ్చిన వారసులు హీరోయిన్స్‌ గా సెటిల్‌ అవ్వలేక పోయారు కనుక పవిత్ర రాకపోవడమే మంచిది అని పూరి జగన్నాధ్‌ సన్నిహితులు మరియు అభిమానులు అంటున్నారు.