Begin typing your search above and press return to search.

పబ్లిక్ ఒపీనియన్: టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్..?

By:  Tupaki Desk   |   15 May 2021 2:30 AM GMT
పబ్లిక్ ఒపీనియన్: టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్..?
X
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కొందరు హీరోలు దర్శకులు కలిసి సినిమా చేస్తే చూడాలని కోరుకుంటుంటారు. కొన్ని హిట్ కాంబోలుగా మరికొన్ని ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతుంటాయి. ప్రస్తుతం కొన్ని క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే కొన్ని సెట్స్ మీద ఉంటే.. ఇంకొన్ని రాబోయే రోజుల్లో పట్టాలెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో 'టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ ఏది?' అని పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోడానికి 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ నిర్వహించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ కి ఎక్కువ మంది ఓటేశారు. వీరిద్దరి కలయికలో ఓ సినిమా చూడాలని సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. జక్కన్న - మహేష్ సైతం గత కొన్నేళ్లుగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వీరి కాంబోలో సినిమా కన్ఫర్మ్ అయింది. 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత మహేష్ తోనే సినిమా చేస్తానని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఆడియన్స్.. వీరి కాంబినేషన్ కు 26.18% మంది ఓట్ చేశారు.

ఆ తర్వాత రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబో 18.02% మంది మద్ధతుతో రెండో ప్లేస్ లో ఉంది. షో మ్యాన్ శంకర్ - చరణ్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి నిత్యం ఈ సినిమా వార్తల్లో ఉంటూనే ఉంది. శంకర్ తో ఓ సినిమా చేయాలని చిరంజీవి ఆశ పడగా.. ఇప్పుడు తనయుడు చరణ్ ఆ కోరిక తీరుస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందనున్న '#RC15' ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

'గబ్బర్ సింగ్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ 13.95% ఓటింగ్ తో మూడో స్థానంలో ఉంది. పవర్ ఫుల్ కాంబోలో మరో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల తర్వాత పవన్ - హరీష్ కాంబోలో '#PSPK28' చిత్రానికి అనౌన్స్ మెంట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది.

ప్రస్తుతం 'సలార్' సినిమా చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో 13.15 శాతంతో తర్వాతి ప్లేస్ లో ఉంది. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కలిసి చేస్తున్న 'సలార్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సూపర్ హిట్ 'జనతా గ్యారేజ్' సినిమా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ కు 10.74% మంది ఓటేశారు. వీరిద్దరూ కలిసి మళ్ళీ '#NTR30' కోసం వర్క్ చేయనున్నారు. ఇక 'అతడు' 'ఖలేజా' సినిమాల తర్వాత '#SSMB28' కోసం కలుస్తున్న మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ లది క్రేజీ కాంబో అని 7.62% మంది అంటున్నారు. 'పుష్ప' సినిమా చేస్తున్న అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ కు 5.50% ఓట్లు మాత్రమే వచ్చాయి. పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్న ప్రభాస్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోకి 4.84% మంది ఓట్ వేశారు. ఈ పోల్ ని బట్టి ప్రస్తుతం 'మహేష్ - రాజమౌళి' కాంబినేషన్ కు ఎక్కువ క్రేజ్ ఉందనేది అర్థం అవుతోంది.