Begin typing your search above and press return to search.

#PSPK 27.. నిర్మాత గుండెల‌దిరే బ‌డ్జెట్

By:  Tupaki Desk   |   13 March 2020 4:06 AM GMT
#PSPK 27.. నిర్మాత గుండెల‌దిరే బ‌డ్జెట్
X
ఏ హీరో.. హీరోయిన్‌ కైనా సినిమాల్లో గ్యాప్‌ వస్తే.. మళ్ళీ తన స్థానంలో కుదురుకోవడం.. రాణించడం చాలా కష్టం. ఫ్యాన్‌ బేస్‌ తగ్గిపోతుంది. మార్కెట్‌ పరంగా అది కాస్త ఇబ్బందికరం. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్ళి దాదాపు రెండున్న‌రేళ్ల‌ గ్యాప్‌ తర్వాత తిరిగి సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీలో సామాజిక సందేశంతో కూడిన `పింక్‌` రీమేక్ లో నటిస్తున్నారు. `వకీల్‌ సాబ్‌`పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్‌ విషయంలో ఆశాజనకమైన ఆఫర్స్ రాక పోవడంతో సినిమాని ఒరిజినల్‌ తో పోల్చితే చాలా మార్పులు చేసి, కమర్షియల్‌ అంశాలను జోడించారట. పవన్‌ సరసన ఓ హీరోయిన్ ని కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఓ ప్రత్యేక సాంగ్‌ కూడా పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. మహిళలకు సంబంధించి మంచి మెసేజ్ ని అందించే ఈ చిత్రంలో ఇలాంటి కమర్షియల్‌ అంశాలు జోడిస్తే ఎలా అనే విమర్శలు ఇప్ప‌టికే ఎదుర‌వుతున్నా అవేవీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

ఇదిలా ఉంటే క్రిష్‌ దర్శకత్వం లో పవన్ ప్యార‌ల‌ల్ గా మరో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. #PSPK 27 పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ఈ చిత్రాన్ని పవన్‌ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందిస్తున్నారట. మోఘలుల‌ కాలం నాటి కథతో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో భారీగా వీఎఫ్‌ ఎక్స్ షాట్స్ కి అవకాశం ఉందని.. అలాగే పీరియడ్ కి సంబంధించి భారీగా సెట్స్ వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. దీంతో బడ్జెట్‌ భారీగా అవుతుందట. ఏకంగా రూ.150కోట్లు బడ్జెట్ ని దర్శకుడు క్రిష్‌ డిమాండ్‌ చేస్తున్నారనే ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్‌ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఇది వర్కౌట్‌ అవుతుందా అనే సందిగ్ధంలో ఏ.ఎం.రత్నం పడ్డారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని నిర్మించేది ఆయనే కాబట్టి. ఇంత బడ్జెట్ తో పవన్‌ హీరోగా సినిమా అంటే క్రిష్‌ రిస్క్‌ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక 150 కోట్ల బ‌డ్జెట్ అంటే బాహుబ‌లి -1 కోసం ఆర్కా మీడియా ఎంత పెట్టిందో అంత పెద్ద మొత్తం అన్న‌మాట‌. అయితే బాహుబ‌లి - ది బిగినింగ్ దేశ‌ వ్యాప్తంగా రిలీజై ఏకంగా 600 కోట్ల వ‌సూళ్లు సాధించింది. అయితే ఆ ఊపు ఇప్పుడు ప‌వ‌న్ కి అంత స్టామినా సాధ్య‌మేనా? అన్న‌ది ఆలోచించాల్సిన విష‌య‌మే.

ఈ చిత్రానికి `విరూపాక్ష` అనే టైటిల్ ని అనుకుంటున్నారట. గతకొన్ని రోజులుగా ఈ టైటిల్‌ ఫిల్మ్ నగర్ లో సర్కిల్‌ అవుతుంది. ఇందులో కథానాయికని ఇంకా ఫైనల్‌ చేయలేదు. ప్రగ్యా జైస్వాల్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదే సెట్‌ అయితే ప్రస్తుతం అవకాశాలు లేని ప్రగ్యా కెరీర్‌ టర్న్ తీసుకుంటుందని చెప్పొచ్చు.