Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ మళ్లీ మార్చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Feb 2018 8:22 AM GMT
త్రివిక్రమ్ మళ్లీ మార్చేస్తున్నాడు
X
స్టార్ డైరెక్టర్లు చాలా వరకు ఒక గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్ తో కంటిన్యూ అయిపోవడానికి ఇష్టపడుతుంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకప్పుడు ఒకే టీంతో వరుసగా సినిమాలు చేసేవాడు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్.. ఛాయాగ్రాహకుడిగా ప్రసాద్ మూరెళ్ల త్రివిక్రమ్ టీంలో రెగులర్ గా ఉండేవాళ్లు. కానీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత వీళ్లిద్దరికీ టాటా చెప్పేశాడు త్రివిక్రమ్. ‘అఆ’కు మిక్కీ జే మేయర్ తో సంగీతం.. నటరాజ్ సుబ్రమణ్యన్ తో ఛాయాగ్రాహం చేయించుకున్నాడు. ఇక ‘అజ్ఞాతవాసి’కి మళ్లీ టెక్నీషియన్లు మారిపోయారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరిస్తే.. మణికందన్ ఛాయాగ్రహణం అందించాడు.

ఇప్పుడు త్రివిక్రమ్ తర్వాతి సినిమాకు మళ్లీ టెక్నీషియన్లు మారిపోతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయం ఇంకా ఖరారవ్వలేదు. ఐతే ఛాయాగ్రాహకుడు మాత్రం కన్ఫమ్ అయ్యాడు. ‘మనం’.. ‘ఊపిరి’.. ‘ధృవ’ లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన పి.ఎస్.వినోద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నట్లు సమాచారం. విక్రమ్ కుమార్ సినిమాలకు రెగ్యులర్ గా పని చేసే వినోద్.. త్రివిక్రమ్ సినిమాకు వర్క్ చేయనుండటం ఇదే తొలిసారి. సినిమాటోగ్రాఫర్ ఎవరైనప్పటికీ త్రివిక్రమ్ సినిమాల్లో విజువల్స్ చాలా అందంగా.. ఆహ్లాదంగా ఉంటాయి. స్వతహాగా మంచి అభిరుచి ఉన్న వినోద్ కు.. త్రివిక్రమ్ టేస్టు కూడా కలిస్తే ఔట్ పుట్ చాలా బాగుంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే.