Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్‌ కే తదుపరి షెడ్యూల్‌ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   9 Aug 2021 7:55 AM GMT
ప్రాజెక్ట్‌ కే తదుపరి షెడ్యూల్‌ ఎప్పుడు?
X
ప్రభాస్‌ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది. అమితాబచ్చన్ పై వారం షెడ్యూల్‌ ను యూనిట్‌ సభ్యులు ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేది గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్ లో కేవలం అమితాబ్‌ పై మాత్రమే సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ షెడ్యూల్‌ లో ప్రభాస్ పై సన్నివేశాలను చిత్రీకరించింది లేదు. ప్రస్తుతం సలార్‌ సినిమా చిత్రీకరణ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఆ తర్వాత ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ కు జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ వరకు సలార్ మరియు ఆదిపురుష్‌ ల షూటింగ్‌ ల్లో పాల్గొనే ప్రభాస్ ఆ తర్వాత నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రాజెక్ట్‌ కే కు డేట్లు ఇవ్వబోతున్నాడు. అక్టోబర్ నుండి ప్రాజెక్ట్‌ కే షూటింగ్ లో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ కూడా పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్‌ నెల మొత్తం కూడా ప్రభాస్‌.. అమితాబచ్చన్‌ మరియు దీపికల కాంబోలో సన్నివేశాలు ఉంటాయట. ముఖ్యంగా అమితాబచ్చన్‌ డేట్లు తక్కువగా ఉన్నాయి కనుక ఆయన పై సన్నివేశాలను ముగించాలనే ఉద్దేశ్యంతో అక్టోబర్‌ మొత్తంను ఆయన సన్నివేశాల కోసం కేటాయించారని సమాచారం అందుతోంది.

అశ్వినీదత్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా కాకుండా అంతకు మించి అన్నట్లుగా విడుదల కాబోతుందని అంటున్నారు. ఆదిత్య 369 మరియు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మిక్స్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. దేవలోకం నుండి టైమ్‌ ట్రావెల్‌ చేసిన సమయంలో హీరోయిన్‌ హీరోకు తారస పడుతుందని.. తద్వారా హీరో కు లభించిన స్పెషల్‌ పవర్స్ ఏంటీ అనే విషయాన్ని అద్బుతంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చూపించబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కథ ఏమో కాని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఊహించేసుకుంటున్నారు. ప్రతి ఊహ కూడా చాలా అద్బుతంగానే ఉంది. ప్రభాస్ ను గ్లోబల్‌ స్టార్‌ గా నిలిపే సినిమా అవ్వబోతుంది అంటూ ప్రాజెక్ట్ కే పై ఆయన అభిమానులు చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. అద్బుతమైన కథ మరియు కథనాన్ని ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ రాసుకున్నాడు.

ఎన్నో అద్బుత సినిమాలను ఆవిష్కరించిన సింగీతం వారు ఈ సినిమాకు మెంటర్‌ గా వ్యవహరించబోతున్నారు. అన్ని విషయాల్లో కూడా ఆయన ఆలోచనలు ఈ సినిమాలో ఉన్నాయి. కథ నుండి మొదలుకుని స్క్రీన్‌ ప్లే మరియు దర్శకత్వం అన్ని విషయాల్లో కూడా ఆయన సలహాలు సూచనలు ఉంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. గ్రాఫిక్స్ లేని సమయంలోనే అద్బుతాలను ఆవిష్కరించిన ఆయన ఈ సినిమాకు ఖచ్చితంగా ది బెస్ట్‌ మెంటర్‌ గా నిలుస్తాడని అనిపిస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల అయ్యేనా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాదిలో సలార్ తో పాటు ఆదిపురుష్ కూడా ఉంటుంది. కనుక 2023 వరకు ఈ సినిమా కోసం వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటూ అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఇదో అద్బుతంగా నిలవడం ఖాయం అంటూ అభిమానులు ఇప్పటి నుండే ఎదురు చూపులు మొదలు పెట్టారు.