Begin typing your search above and press return to search.

ప్రభాస్ - పవన్ లతో సినిమాలు చేస్తున్నా చెప్పుకోలేని స్థితిలో నిర్మాతలు..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 4:31 AM GMT
ప్రభాస్ - పవన్ లతో సినిమాలు చేస్తున్నా చెప్పుకోలేని స్థితిలో నిర్మాతలు..!
X
ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా తమ బ్యానర్ లో పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించి లాభాలు పొందాలని ఆశిస్తుంది. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడానికి దర్శక హీరోలకు భారీగా అడ్వాన్సులు ఇస్తూ.. వారి నుంచి కమిట్ మెంట్స్ తీసుకుంటుంటారు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లోని ఓ నిర్మాణ సంస్థ ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు లైన్ లో పెట్టుకొని కూడా అధికారికంగా ప్రకటించుకోలేని స్థితిలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ బ్యానరే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఆ ఇద్దరు బిగ్ హీరోలు మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఇటీవల 'కార్తికేయ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తో 'ధమాకా' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు. అలానే ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ లతో సినిమాలకు సన్నద్ధం అవుతోంది.

ప్రస్తుతం పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి కానీ.. ఫైనల్ గా పీపుల్ మీడియా చేతికి ఈ సినిమా వచ్చి చేరింది.

ఇప్పటికే ప్రభాస్ - మారుతి సినిమాని సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకొచ్చారు. అయినప్పటికీ మేకర్స్ ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. నిజానికి ఈ సినిమాకి డార్లింగ్ అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది. సరైన కాంబినేషన్ సెట్ చేయలేదని విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం 'సలార్' 'ప్రాజెక్ట్ K' 'స్పిరిట్' వంటి చిత్రాలను లైనప్ లో పెట్టుకున్న ప్రభాస్.. ఇంతవరకు స్టార్ హీరోలను డీల్ చేయని మారుతి తో సినిమా చేయడం ఏంటని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ చిత్రానికి శ్రీకారం చుట్టిన పీపుల్స్ మీడియాపై ట్రోల్ చేస్తూ వస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ తో 'వినోదయ సీతమ్' అనే తమిళ్ రీమేక్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తారు. అయితే ఇప్పటికే రీమేక్స్ తో విసిగిపోయిన పీకే ఫ్యాన్స్.. మరో రీమేక్ ప్రాజెక్ట్‌ చేయకూడదని ఆశిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు. అందుకేనేమో దీని గురించి మేకర్స్ ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.

ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ చేయబడి ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన చిత్రాన్ని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయకూడదని అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా పక్కన పెట్టేయమని సోషల్ మీడియా వేదికగా హీరోని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి రీమేక్ ప్రాజెక్ట్ సెట్ చేసినందుకు నిర్మాతలపై విరుచుకుపడుతున్నారు.

ఇలా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తలపెట్టిన రెండు సినిమాలకూ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ - పవన్ కళ్యాణ్ లతో సినిమాలు చేస్తున్నా అధికారిక ప్రకటన కూడా చేయడం లేదు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఈ చిత్రాలను బ్యాంక్‌ రోల్ చేయడానికి రెడీ అయ్యారు. మరి కొంత భాగం షూటింగ్ అయ్యాక మంచి రోజు చూసి స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.