Begin typing your search above and press return to search.

శృతి హాసన్ బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్న చిత్రం అదేనట..!

By:  Tupaki Desk   |   20 Feb 2022 1:30 AM GMT
శృతి హాసన్ బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్న చిత్రం అదేనట..!
X
దక్షిణాది అగ్ర కథనాయుకల్లో ఒకరైన శృతి హాసన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఒకప్పుడు ప్లాప్ లతో ఐరన్ లెగ్ అనిపించుకున్న శ్రుతి.. ఆ తర్వాత రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె కెరీర్ లో గుర్తిండిపోయే సినిమాల్లో ''ప్ర్రేమమ్'' ఒకటి. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా సితార బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

చైతూ - శృతితో పాటుగా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులకు మంచి పేరు తెచ్చిపెటింది. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ప్రేమమ్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. అక్కడ సాయిపల్లవి పోషించిన పాత్రలో ఇక్కడ శృతిహాసన్ నటించింది. అప్పట్లో ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత శృతిని పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు. సహజంగా నటించిన సాయి పల్లవి రోల్ కు న్యాయం చేయలేదని విమర్శించారు. కానీ ఫైనల్ గా 'ప్ర్రేమమ్' విడుదలయ్యాక అందరూ శృతిని యాక్సెప్ట్ చేసారు.

అయితే 'ప్రేమమ్' చిత్రం గురించి శృతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. "టాలీవుడ్ లో నన్ను బాగా ట్రోల్ చేసిన చిత్రం ఏదైనా ఉందంటే అది 'ప్రేమమ్'. ఒరిజినల్ 'ప్రేమమ్' చిత్రానికి విశేష ఆదరణ లభించింది. మలయాళంలో సాయిపల్లవి చేసిన మలర్ పాత్రను తెలుగులో మీరు చేయండి అని చిత్రబృందం నన్ను సంప్రదించినప్పుడు ఆ పాత్ర బాగా నచ్చినా.. ఒక్క క్షణం మాత్రం చేయకూడదనుకున్నా. కాస్త ఆలోచించి ఓకే చెప్పేశా''

''ఎలాంటి తరహా పాత్ర అయినా సరే సవాలుగా స్వీకరించి.. నా శైలిలో చేయాలని మలర్ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నా. ఎవరేమనుకున్నా నాకెందుకు అనుకున్నా. మలర్ పాత్ర నాకు బాగా నచ్చింది. అయితే సాయిపల్లవిని మరిపించేలా నటించాలని అనుకోలేదు. అయినా సరే విపరీతంగా ట్రోల్స్ చేశారు. అదృష్టం కొద్దీ ఆ సినిమా విజయం సాధించింది. ఇక ట్రోల్స్ ని పాజిటివ్ గా తీసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇతరులతో మనల్ని మనం పోల్చుకోకూడదు. అలానే ఎవరైనా సద్విమర్శలు చేస్తే తప్ప.. నీకు నువ్వు ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఇంకొకరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు'' అని శృతి చెప్పుకొచ్చింది.

ఇకపోతే 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శృతిహాసన్.. 'ఓ మై ఫ్రెండ్' 'బలుపు' 'ఎవడు' 'గబ్బర్ సింగ్' 'రేసుగుర్రం' 'శ్రీమంతుడు' వంటి సినిమాలతో విజయాలను అందుకుంది. అయితే 'కాటమరాయుడు' సినిమా తర్వాత కొన్నాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత 'క్రాక్' - 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ప్రస్తుతం ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సలార్' అనే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది శృతి హాసన్. అలానే నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో వస్తోన్న '#NBK107' సినిమాలోనూ నటిస్తోంది. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం 'ది బెస్ట్ సెల్లర్' ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది.