Begin typing your search above and press return to search.

వంశీ పైడిపల్లి - దిల్ రాజు.. మధ్యలో పీవీపీ..!

By:  Tupaki Desk   |   23 Jun 2022 12:21 PM GMT
వంశీ పైడిపల్లి - దిల్ రాజు.. మధ్యలో పీవీపీ..!
X
'మున్నా' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వంశీ పైడిపల్లి.. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. 'బృందావనం' 'ఎవడు' 'ఊపిరి' 'మహర్షి' వంటి విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ తో 'వారసుడు' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే వీటిల్లో ఐదు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లోనే రూపొందడం గమనార్హం. 'ఊపిరి' చిత్రాన్ని మాత్రం ప్రసాద్ వి పొట్లూరి (పీవీపీ) నిర్మించారు.

'ఊపిరి' సినిమా సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి - నిర్మాత పివిపి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో అదే బ్యానర్ లో మరో సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చారు. అయితే 'మహర్షి' సినిమాని దిల్ రాజు - అశ్వినీ దత్ నిర్మించడానికి రెడీ అయిపోయారు.

దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో పీవీపీ కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత మహేష్ బాబు ఇందులో ఎంటరై పీవీపీ ని కూడా భాగం చేశారని టాక్. ఏదైతేనేం సినిమా హిట్ అయింది.. వంశీ - పీవీపీ మధ్య వివాదం అక్కడితో ముగిసింది.

ఇప్పుడు విజయ్ ని టాలీవుడ్ లో లాంచ్ చేస్తూ ''వారసుడు'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు వంశీ పైడిపల్లి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే బుధవారం విజయ్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మెగా ట్విస్ట్ వెల్లడైంది. ఇందులో దిల్ రాజు బ్యానర్ తో పీవీపీ సంస్థ కూడా యాడ్ అయింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

'వారసుడు' సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారని ప్రకటించగా.. సడన్ గా ఇప్పుడు పీవీపీ కూడా ఈ ప్రాజెక్ట్ లో అసోసియేట్ అయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ ముందుగా పీవీపీ నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్నాడని.. ఇందులో భాగంగా ఆయన్ని ఈ ప్రాజెక్ట్ లో పార్ట్‌నర్‌ గా చేసుకున్నాడని కొందరు అంటున్నారు.

అయితే దిల్ రాజు - పీవీపీ మధ్య సాన్నిహిత్యం ఉంది. 'మహర్షి' సినిమా కలిసి చేసిన వీరిద్దరూ.. ప్రస్తుతం విశ్వక్ సేన్ తో 'ఓ మై కడవులే' రీమేక్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'వారసుడు' సినిమాలోనూ భాగం అయ్యుండొచ్చని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ బైలింగ్విల్ సినిమాకి దిల్ రాజుతో పాటుగా పీవీపీ కూడా ఇప్పుడు అఫీషియల్ ప్రొడ్యూసర్. అయితే ఈ ప్రాజెక్ట్ లోకి 'ఊపిరి' నిర్మాత చేరడం వెనుక ఏం జరిగిందనేది వారికే తెలియాలి.