Begin typing your search above and press return to search.

ఐదేళ్ల‌ వ‌ర‌కూ ప్ర‌భాస్ చిక్క‌డు దొర‌క‌డు

By:  Tupaki Desk   |   8 May 2021 2:30 PM GMT
ఐదేళ్ల‌ వ‌ర‌కూ ప్ర‌భాస్ చిక్క‌డు దొర‌క‌డు
X
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తదుప‌రి స‌లార్- ఆదిపురుష్ 3డి చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర్వాతా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు. ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషికం లాభాల్లో వాటాలు అందుతున్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎంచుకునే ప్ర‌తిదీ తెలుగు మార్కెట్ తో పాటు ఇరుగు పొరుగు భాష‌ల మార్కెట్ ని చేజిక్కించుకునే ప్ర‌య‌త్న‌మే. ముఖ్యంగా హిందీ మార్కెట్ ని కొల్ల‌గొట్టేందుకు ప్ర‌భాస్ గ‌ట్టి ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ప్ర‌తిదీ పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కుతున్న యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ సినిమానే.

ఏడాది చివ‌రి నాటికి స‌లార్- ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ‌ల‌పై క్లారిటీ వ‌స్తుంది. కరోనావైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున ఈ సినిమాల చిత్రీకరణలో ఆలస్యం ఎదుర‌వుతుంది. ఈ సంవత్సరం చివరి నుండి లేదా వచ్చే ఏడాది ఆరంభం నుండి నాగ్ అశ్విన్ తో చిత్రాన్ని ప్రభాస్ ప్రారంభిస్తారు. ఈ చిత్రం షూటింగ్ ను 2022 చివరి నాటికి నాగ్ అశ్విన్ పూర్తి చేయాల్సి ఉంటుంద‌ట‌.

ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సెట్స్ కెళుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అటుపై ప్రభాస్ మరోసారి `స‌లార్` ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తోనే సినిమా చేస్తారు. 2024లో ప్రారంభమయ్యే ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తారు.

ఇదిలా ఉండ‌గానే ప్ర‌భాస్ తో అవ‌కాశం కోసం చాలామంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూక‌డుతున్నార‌ని స‌మాచారం. ఇందులో క‌ర‌ణ్ జోహార్.. టీసిరీస్ అధినేత‌లు కూడా ఉన్నారు. కానీ వీళ్లంద‌రికీ మ‌రో నాలుగైదేళ్ల పాటు కాల్షీట్లు కేటాయించ‌డం క‌ష్ట‌మ‌ని ప్ర‌భాస్ చెబుతున్నార‌ట‌. ఆ లెక్క‌న 2025 వ‌ర‌కూ ఇక ప్ర‌భాస్ తో ఎవ‌రికీ అవ‌కాశం లేన‌ట్టేన‌ని చెబుతున్నారు.