Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ హీరో కోసం స్టార్స్ అందరినీ దింపుతున్న అగ్ర నిర్మాత..!

By:  Tupaki Desk   |   12 Jan 2022 8:41 AM GMT
ఫ్యామిలీ హీరో కోసం స్టార్స్ అందరినీ దింపుతున్న అగ్ర నిర్మాత..!
X
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు, శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి “రౌడీ బాయ్స్” అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 'హుషారు' ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే దిల్ రాజు తమ ఫ్యామిలీ హీరో లాంచింగ్ మూవీ కోసం టాలీవుడ్ స్టార్స్ అందరినీ రంగంలోకి దింపుతున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రమోషనల్ కంటెంట్ ను వాళ్ళ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తూ.. సినిమాపై బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 'రౌడీ బాయ్స్' సినిమా ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ లను సుకుమార్ - విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.

అలానే సినిమాలోని 'డే అండ్ నైట్' సాంగ్ ను అల్లు అర్జున్ లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ''రౌడీ బాయ్స్'' చిత్రంలోని 'యే జిందగీ' అనే మరో పాటను విడుదల చేశారు. ఈ పాట బాగుందని పేర్కొన్న ప్రభాస్.. ఆశిష్ మరియు మొత్తం టీమ్ కు విషెస్ అందజేశారు.

'రౌడీ బాయ్స్' సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ - బన్నీ - విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ భాగం అయ్యారు. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న దిల్ రాజు.. తమ్ముడి కొడుకుని హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడమే కాకుండా.. దీనికి తగ్గట్టుగా పబ్లిసిటీ చేస్తున్నారు. మరి ఆశిష్ కు ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

కాగా, 'రౌడీ బాయ్స్' చిత్రాన్ని కాలేజీ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇందులో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సహిదేవ్ విక్రమ్ - కార్తీక్ రత్నం - శ్రీకాంత్ అయ్యంగార్ - తేజ్ కూరపాటి - కోమలీ ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మధే సినిమాటోగ్రఫీ అందించగా.. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా.. మధు ఎడిటర్ గా వర్క్ చేశారు.