Begin typing your search above and press return to search.

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో మరో సినిమా..?

By:  Tupaki Desk   |   25 Jan 2022 10:37 AM GMT
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో మరో సినిమా..?
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరో మన డార్లింగ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి.. ఎప్పుడు రిలీజ్ అవుతాయనేది పక్కన పెడితే.. యంగ్ రెబల్ స్టార్ మాత్రం కొత్త స్క్రిప్ట్స్ ఓకే చేస్తూ.. అడ్వాన్సులు తీసుకుంటూ ఫుల్ స్వింగులో ఉన్నాడని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో అగ్ర కథనాయకుడు ఓ మూవీకి కమిట్ అయ్యారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. అలానే 'ఆదిపురుష్‌' 'స‌లార్' 'ప్రాజెక్ట్ K' వంటి చిత్రాలు సెట్స్‌ మీద ఉన్నాయి. ఇదే క్రమంలో సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో డార్లింగ్ ఓ మూవీ చేస్తారనే టాక్ ఉంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేస్తారని గత రెండు రోజులుగా ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగుతోంది. ఈ క్రమంలో క‌ర‌ణ్ జోహార్ తో ఓ మూవీ చేయ‌డానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని టాక్ నడుస్తోంది.

'బాహుబలి' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన క‌ర‌ణ్ జోహార్.. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయ‌డానికి ఎప్పటి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందుకు గాను డార్లింగ్ కు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు బాలీవుడ్ అగ్ర నిర్మాతతో ప్రభాస్ సినిమా కార్యరూపం దాల్చబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్‌ కాంబినేషన్ లో ''ప్రాజెక్ట్ కె'' అనే పాన్ వరల్డ్ మూవీ రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్తవ్వగానే మ‌ళ్లీ ప్ర‌భాస్‌ కోసమే దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నారట. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయిన కరణ్ జోహార్.. 'ప్రాజెక్ట్ K' సినిమాని బాలీవుడ్ లో ప్ర‌మోట్ చేసే బాధ్య‌త కూడా తీసుకోబోతున్నారట. ధర్మా ప్రొడక్షన్స్ లో ప్రభాస్ - నాగ్ అశ్విన్ ల సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.