Begin typing your search above and press return to search.

అదే కథను కొత్తగా చెప్పడం వల్లే ఒప్పుకున్న ప్రభాస్‌

By:  Tupaki Desk   |   6 Dec 2020 3:30 PM GMT
అదే కథను కొత్తగా చెప్పడం వల్లే ఒప్పుకున్న ప్రభాస్‌
X
కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ వచ్చే నెలలో పట్టాలెక్కబోతుంది. భారీ హంగామాతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో కాకుండా ప్రభాస్‌ తో 'సలార్‌' మూవీని ప్రశాంత్‌ నీల్‌ ఒక భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా చిత్రీకరించబోతున్నాడు. ప్రశాంత్‌ గతంలో కన్నడంలో చేసిన 'ఉగ్రమ్‌' కు ఇది రీమేక్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. అధికారికంగా అయితే ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు కాని.. ఉగ్రమ్‌ చూసిన జనాలు కొందరు ప్రభాస్‌ ఈ సినిమాకు ఎలా ఒప్పుకున్నాడు అనే కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రభాస్‌ అభిమానులు ఇటీవల చాలా మంది కన్నడ ఉగ్రమ్‌ ను వెదికి మరీ చూస్తున్నారు. ప్రభాస్‌ ఉగ్రమ్‌ లో ఎలా ఉంటాడో అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉగ్రమ్‌ ఒక సింపుల్‌ మాస్‌ కథతో రూపొందింది. అలాంటి మూవీని పాన్ ఇండియా మూవీగా చేయడం కాస్త ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఉగ్రమ్‌ ను పూర్తిగా మార్చేసి ప్రభాస్‌ రేంజ్‌ కి తగ్గట్లుగా భారీ యాక్షన్‌ సీన్స్ తో ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడట.

ఉగ్రమ్‌ స్టోరీ లైన్‌ నే తీసుకుని అంతకు మించి అన్నట్లుగా ప్రభాస్‌ కు ప్రశాంత్‌ నీల్‌ చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే అన్ని గ్రాఫిక్స్ మూవీస్‌ కాకుండా ఇలాంటి యాక్షన్‌ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని ప్రభాస్‌ భావించాడట. ప్రభాస్‌ దీన్ని ఒక ప్రయోగంగా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌ చేస్తున్న ఈ ప్రయోగం ఏంత వరకు సక్సెస్‌ అయ్యేనో చూడాలి.