Begin typing your search above and press return to search.

దర్శక నిర్మాతలను వేడుకుంటున్న పవర్ స్టార్

By:  Tupaki Desk   |   19 March 2020 5:31 AM GMT
దర్శక నిర్మాతలను వేడుకుంటున్న పవర్ స్టార్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూసి రెండు సంవత్సరాలు అవుతోంది. తన కెరీర్లో 25వ చిత్రంగా విడుదలైన 'అజ్ఞాతవాసి' భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద చతికిలిపడిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్న పవన్ కళ్యాణ్ 2019 ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత తాను ఇంక సినిమాలలోకి రానని, పూర్తి జీవితం ప్రజాసేవకే అని ప్రకటించి అభిమానులను వేదనకు గురిచేసారు. ఏపీ ప్రత్యక్ష ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పవన్ తర్వాత ఏర్పడిన పరిస్థితుల వలన మరలా మేక్-అప్ వేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం ఫ్యాన్స్ ని ఆనందానికి గురి చేసింది.

పవన్ కళ్యాణ్ తన కమ్ బ్యాక్ మూవీగా హిందీ చిత్రం 'పింక్' రీమేక్ ని ఎంచుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న'వకీల్ షాబ్' చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్ర బాధ్యతను డైరెక్టర్ క్రిష్ కు అప్పజెప్పాడు. పీరియాడికల్ ఈ చిత్రాన్ని బడా నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో నిర్మాతలు చిత్ర నిర్మాణాలను ఆపేసిన విషయం తెలిసిందే. దీని కారణంగా మే నెలలో విడుదల కావాల్సిన 'వకీల్ షాబ్' చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో ఇప్పుడిప్పుడే విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వకీల్ సాబ్‌ను సకాలంలో పూర్తి చేయాలని నిశ్చయించుకున్న పవర్ స్టార్ తన మిగతా చిత్రాల చిత్రీకరణకు బ్రేక్ వేయాలని డిసైడ్ అయ్యారంట. మొదట వకీల్ సాబ్ చిత్రీకరణను ముగించి, తర్వాత వారి చిత్రాన్ని ప్రారంభించమని చిత్ర దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏ.ఎమ్.రత్నాన్ని కోరినట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా తన పూర్వ వైభవాన్ని పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.