Begin typing your search above and press return to search.

మార్పు రానప్పుడు ఆ నలుగురిని చంపి ఏం లాభం : పోసాని

By:  Tupaki Desk   |   3 Dec 2019 10:26 AM GMT
మార్పు రానప్పుడు ఆ నలుగురిని చంపి ఏం లాభం : పోసాని
X
హైదరాబాద్‌ లో జరిగిన దిషా సంఘటనపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభలు రెండు రోజులుగా దద్దరిల్లుతున్నాయి. దిషా నిందితులను వెంటనే ఉరి తీసి చంపేయాలని కొందరు ఎన్‌ కౌంటర్‌ చేయాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు మరియు పలు ఇతర సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ సంఘటనపై సినీ ప్రముఖులు కూడా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

ఈ విషయమై పోసాని కృష్ణ మురళి కూడా స్పందించారు. ఏ విషయంలో అయినా చాలా విశ్లేషించి విపులంగా మాట్లాడే పోసాని దిషా విషయంలో కూడా అలాగే స్పందించాడు. ఆ నలుగురిని చంపేయాలంటూ అంతా డిమాండ్‌ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మార్పు రాదు. ఆ నలుగురిని చంపినంత మాత్రాన దేశంలో జరుగుతున్న సంఘటనలు ఆగిపోవు. ఎప్పుడైతే మన సమాజం మన రాజకీయ వ్యవస్థ మార్పు చెందుతుందో అప్పుడే ఈ దేశంలో నేరాలు జరగకుండా ఉంటాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అరబ్‌ కంట్రీస్‌ లో ప్రజలు నీతిగా ఉంటారు.. రాజకీయ నాయకులు నిజాయితీగా ఉంటారు. అందుకే ఏదైనా నేరం జరిగితే కఠిన శిక్ష వేయడం జరుగుతుంది. ఒక్కరు ఇద్దరు అక్కడ నేరం చేసే వారు ఉంటారు. కాని మన సమాజంలో అలా లేదు. 130 కోట్ల మంది కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది అంటూ పోసాని పేర్కొన్నాడు. మనం ఎన్నుకున్న నాయకులు మరియు ప్రభుత్వం నియమించిన పోలీసులు మనం కొలిచే బాబాలు ఇలా అందరు కూడా మంచి వారు కావాలి. అలాంటప్పుడే నేరాలు తగ్గుతాయన్నాడు.

తన కూతురు మిస్‌ అయ్యిందని చెప్తే ఎవరితో అయినా లేచి పోయిందేమో అంటూ నీచంగా మాట్లాడిన పోలీసులు సస్పెండ్‌ చేశారు. కాని అదే పోలీసు మళ్లీ ఓ మంత్రినో లేదా రాజకీయ నాయకుడినో పట్టుకుని మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అవుతాడు. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం కనుకే ఇలాంటి నేరాలు దారుణంగా పెరిగి పోతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసే పద్దతి మన వ్యవస్థలో రావాలి. అలాంటప్పుడే మంచి రాజకీయ నాయకులు వస్తారు. దిషా సంఘటన తీవ్రంగా కలచి వేసిందన్న పోసాని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మన వ్యవస్థ మారాలని.. వారిని వెంటనే ఉరి తీసినంత మాత్రాన జరిగేది ఏమీ లేదంటూ పోసాని అన్నాడు.