Begin typing your search above and press return to search.

జనసేన-టీడీపీ పొత్తులపై ప్రముఖ సినీ నటుడి హాట్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   9 Nov 2022 8:30 AM GMT
జనసేన-టీడీపీ పొత్తులపై ప్రముఖ సినీ నటుడి హాట్‌ కామెంట్స్‌
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందనే దాదాపు అంతా నమ్ముతున్నారు. అధికార వైసీపీ కూడా ఇదే విషయాన్ని నమ్ముతోంది. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే 2014 ఫలితం పునరావృతమవుతుందని భయపడుతున్న వైసీపీ దమ్ముంటే 175 చోట్ల ఒంటరిగా పోటీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ను రెచ్చగొడుతోంది.

మరోవైపు టీడీపీతో పొత్తు వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు జీవీ సుధాకర్‌ నాయుడు (జీవీ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో జరిగిన కాపు వన సమారాధనకు హాజరైన ఆయన మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీతో పొత్తు వ్యవహారంపై దయ చేసి ఆలోచించాలని పవన్‌ను జీవీ కోరారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కొన్ని టీవీ చానెళ్లు, పత్రికలు చిరంజీవి ఎలా విమర్శించాయో తాము మరిచిపోలేదన్నారు. చిరంజీవి పార్టీని విలీనం చేసి.. దాన్ని వదిలేసే వరకు వదిలిపెట్టకుండా చిరంజీవిని టార్గెట్‌ చేసుకున్నాయని కొన్ని మీడియా సంస్థల పేర్లు ఎత్తకుండా జీవీ విరుచుకుపడ్డారు. వీటిని ఏమీ తాము మరిచిపోలేదన్నారు.

ప్రజారాజ్యం పార్టీలో సైతం కోవర్టులను పెట్టి.. చిరంజీవి కుటుంబ సభ్యులను తిడుతూ.. పార్టీని మూసేసే వరకు ఎలా చేశారో తాము మరిచిపోలేదన్నారు.

అంతేకాకుండా టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కొడుకు సైతం చిరంజీవి దూషిస్తూ మాట్లాడాడని జీవీ సుధాకర్‌ మండిపడ్డారు. అంతేకాకుండా టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ సైతం.. అన్నను గెలిపించుకోలేని వెధవ మమ్మల్ని గెలిపించడం ఏమిటని ఎగతాళి చేశాడని గుర్తు చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు చెందిన పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పడు ఒకసారి ఆలోచించాలని విన్నవించారు.

కోవర్టులు సైతం ఉంటారని.. చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని పవన్‌ కల్యాణ్‌ను కోరారు. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్‌ ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక గదిలో తలుపులు వేసి మాట్లాడుతుంటే వాటిని కూడా ఒకరిద్దరు కోవర్టులు లైవ్‌ టెలికాస్ట్‌ చేశారని గుర్తు చేశారు.

అలాగే పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టాక ఆయన పెళ్లిళ్లు గురించి, ఫ్యామిలీ గురించి, ప్యాకేజీలంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని తనతోపాటు ఇక్కడ ఉన్నవారు ఎవరూ మరిచిపోలేదని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ను కాపు ముఖ్యమంత్రిగా తాము చూడాలనుకుంటున్నామని జీవీ సుధాకర్‌ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే విశాఖ పర్యటన తర్వాత పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు హోటల్‌కు వచ్చి సంఘీభావం ప్రకటించడం చూసి తాము సగం చచ్చిపోయామన్నారు. మీ భుజం మీ వెనుక మేము ఉండాలనుకుంటున్నామని.. టీడీపీ పొత్తు విషయంలో మాత్రం మరోసారి ఆలోచించాలని జీవీ సుధాకర్‌ నాయుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.