Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్‌కు న‌చ్చితే అంతే..

By:  Tupaki Desk   |   10 Aug 2021 4:30 AM GMT
త్రివిక్ర‌మ్‌కు న‌చ్చితే అంతే..
X
చాలామంది ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. త‌మ‌కు సౌక‌ర్యంగా ఉండేవాళ్ల‌తో మళ్లీ మ‌ళ్లీ ప‌ని చేస్తుంటారు. ఆర్టిస్టుల విష‌యంలోనూ అంతే. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కూ ఇలాంటి అల‌వాటు ఉంది. కానీ ఆయ‌న కాలానికి త‌గ్గ‌ట్లు అప్‌డేట్ అవుతుంటారు. వ‌రుస‌గా కొంద‌రితో కొన్ని సినిమాలు చేస్తాడు కానీ.. త‌ర్వాత సెట‌ప్ అంతా మార్చేస్తుంటారు. ఒక హీరోయిన్‌తో లేదా సంగీత ద‌ర్శ‌కుడితో వ‌రుస‌గా మూణ్నాలుగు సినిమాలు చేయ‌డం..

 ఆ త‌ర్వాత వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి వేరే వాళ్ల‌కు వ‌రుస‌గా అవ‌కాశాలివ్వ‌డం చేస్తుంటారు. హీరోయిన్ల‌లో ముందుగా ఆయ‌న‌కు బాగా న‌చ్చేసి, వ‌రుస‌గా సినిమాలు చేసిన క‌థానాయిక అంటే స‌మంత‌నే. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అఆ.. ఇలా ఆమెతో వ‌రుస‌గా మూడు సినిమాలు చేశాడు త్రివిక్ర‌మ్. అఆలో అయితే హీరో నితిన్‌ను మించి సామ్‌ను హైలైట్ చేయ‌డం తెలిసిందే. ఐతే త‌ర్వాత ఆమెకు టాటా చెప్పేసి పూజా హెగ్డే మాయ‌లో ప‌డ్డాడు త్రివిక్ర‌మ్. ఆమెతో తొలిసారి అర‌వింద స‌మేత కోసం ప‌ని చేశాడు.

అందులో ఆమె ప‌నిత‌నం న‌చ్చి వెంట‌నే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో ఛాన్సిచ్చాడు. పూజా మ‌రోసారి ఆక‌ట్టుకుంది. ఇప్పుడు మ‌హేష్ బాబుతో చేయ‌బోయే కొత్త చిత్రానికి కూడా పూజానే క‌థానాయిక‌గా ఎంచుకున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఇక సంగీత ద‌ర్శ‌కుల విష‌యానికి వ‌స్తే.. మొద‌ట్లో కోటి.. ఆపై మ‌ణిశ‌ర్మ‌తో వ‌రుస‌గా సినిమాలు చేసిన త్రివిక్ర‌మ్.. త‌ర్వాత వ‌రుస‌గా దేవితో జ‌ట్టు క‌ట్టాడు. ఐతే దేవితో ఉన్న‌ట్లుండి క‌ట్ అయింది. అర‌వింద స‌మేత నుంచి త‌మ‌న్‌తో ప్ర‌యాణం మొద‌లుపెట్టాడు. ఆపై వీళ్లిద్ద‌రూ అల‌వైకుంఠ‌పుర‌ములోకు ప‌ని చేశారు. ఇప్పుడు మ‌హేష్ బాబు సినిమాకు కూడా త‌మ‌న్‌నే ఎంచుకున్నాడు. పూజా, త‌మ‌న్‌ల‌తో త్రివిక్ర‌మ్‌కు ఇది హ్యాట్రిక్ మూవీ కావ‌డం విశేషం.