Begin typing your search above and press return to search.

అదుగో.. పందితో పాద యాత్ర

By:  Tupaki Desk   |   1 Nov 2018 1:10 PM GMT
అదుగో.. పందితో పాద యాత్ర
X
సినిమాను తీయడం కంటే సినిమాను క్రియేటివిటీగా ప్రమోషన్‌ చేయడంపైనే సినిమా సక్సెస్‌ ఎక్కువ ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమద్య కాలంలో లక్షల సినిమాకు కోట్ల పబ్లిసిటీ చేస్తే తప్ప ప్రేక్షకుల వద్దకు వెళ్లడం లేదు. కొందరు డబ్బులు ఖర్చు చేసి పబ్లిసిటీ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం కొన్ని వింత పనులు చేసి, జనాలను ఆకర్షిస్తూ పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రామ్‌ గోపాల్‌ వర్మ ఫ్రీ పబ్లిసిటీని ఎక్కువ వాడేసుకుంటాడు. తాజాగా రవిబాబు కూడా ఫ్రీగా తన ‘అదుగో’ చిత్రాన్ని పబ్లిసిటీ చేసేందుకు సిద్దం అయ్యాడు.

దాదాపు రెండు సంవత్సరాలుగా రవిబాబు ‘అదుగో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. పంది పిల్ల చుట్టు తిరిగే కథతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి పంది పిల్లలతో ఫొటోలు దిగడం, వాటితో కలిసి ఆడుతూ, వాటికి ముద్దులు పెడుతూ ఉన్న వీడియోలను విడుదల చేయడం జరిగింది. తాజాగా సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పందితో పాదయాత్రకు సిద్దం అయ్యాడు.

ఈనెల 7న రవిబాబు ‘అదుగో’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే ఈ చిత్రంను విభిన్నంగా ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో రవిబాబు హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్క్‌ వద్ద పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. తన సినిమా పంది నేపథ్యంలో ఉంది కనుక, పందితో పాదయాత్ర చేయబోతున్నాడు. రేపు(నవంబర్‌ 2) సాయంత్రం 3.30 కి కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వద్ద పందితో పాద యాత్ర ప్రారంభం అయ్యి ఫిల్మ్‌ నగర్‌ ఛాంబర్‌ వరకు సాగనుంది. ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే జూబ్లీహిల్స్‌ పోలీసుల వద్ద రవిబాబు అనుమతి కూడా తీసుకున్నాడు. పాద యాత్ర అనంతరం ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పందితో పాదయాత్రలో నిర్మాత సురేష్‌ బాబుతో పాటు ఇతర టెక్నీషియన్స్‌ కూడా పాల్గొనబోతున్నారు.