Begin typing your search above and press return to search.

శిల్పా షెట్టిని ఫొటో తీస్తే.. కెమెరామ‌న్ల‌పై దాడి!

By:  Tupaki Desk   |   8 Sep 2017 1:54 PM GMT
శిల్పా షెట్టిని ఫొటో తీస్తే.. కెమెరామ‌న్ల‌పై దాడి!
X
సాధారణంగా ఆయా రంగాల్లో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించిన వారు ఎక్క‌డ క‌నిపించినా... మీడియా కెమెరామ‌న్లు, ఫొటోగ్రాఫ‌ర్లు ఫొటోలు, వీడియోలు తీయడం చూస్తూనే ఉన్నాం. ఇది స‌ర్వ సాధార‌ణం కూడానూ. అస‌లు మీడియా ఫొటోగ్రాఫ‌ర్లు, కెమెరామ‌న్లు క‌నిపిస్తే... వారి చేతుల్లో కెమెరాల‌ను చూడ‌గానే సెల‌బ్రిటీలు చ‌క్క‌గా ఫోజులిచ్చి మ‌రీ నిల‌బ‌డ‌తారు. అయినా మీడియా లేకుండా తాము సెల‌బ్రిటీలం కాలేమ‌న్న విష‌యం స‌ద‌రు ప్ర‌ముఖుల‌కు కూడా తెలిసిన విష‌య‌మే. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డ ప్ర‌ముఖులు క‌నిపించినా... మీడియా హ‌డావిడి బాగానే ఉంటోంది. ఇటీవ‌లి కాలంలో పెరిగిన మీడియా సంస్థ‌ల కార‌ణంగా ఈ హ‌డావిడి మ‌రింత‌గా ఎక్కువైంద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో నిన్న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి - ఆ త‌ర్వాత యోగా గురువుగా మారిన న‌టి శిల్పా షెట్టిని క్లిక్ మ‌నిపించిన ఇద్దరు ఫొటోగ్రాఫ‌ర్ల‌పై ఏకంగా దాడే జ‌రిగిపోయింది. ఈ దాడి చేసింది శిల్పా షెట్టి వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది ఎంత‌మాత్రం కాదు. ఓ హోట‌ల్ కు చెందిన బౌన్స‌ర్లు ఫొటోగ్రాఫ‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళితే... నటి శిల్పా శెట్టి, భర్త రాజ్‌కుంద్రాతో డిన్నర్‌ కోసం ముంబై - బంద్రాలోని బస్టైన్‌ హోటల్‌కు వచ్చారు. ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడున్న ఫోటో జర్నలిస్టులు - ఔత్సాహికులు కెమెరాలు క్లిక్కుమనిపించారు. ఆశ్చర్యమేమిటంటే వారు కూడా ఫోటోలకు ఫోజులిచ్చారు.

అయితే ఈ జంట కారులోకి వెళ్లి కూర్చోగానే హోటల్‌ బౌన్సర్లు ఒక్కసారిగా ఫోటో జర్నలిస్టులపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో సోను - హిమన్షు షిండే అనే ఫోటో జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తతంగం అంతా కెమెరాలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసిన ఇద్దరి బౌన్సర్లతోపాటు ఫోటో జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు.