Begin typing your search above and press return to search.

'ఖైదీ' వెంట పడ్డ జనాలు..!

By:  Tupaki Desk   |   16 Jun 2022 5:33 AM GMT
ఖైదీ వెంట పడ్డ జనాలు..!
X
కార్తి హీరోగా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ సినిమా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తమిళంలో రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా థియేట్రికల్‌ రిలీజ్‌ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తి స్టార్‌ డమ్ ను మరింతగా పెంచిన ఖైదీ సినిమా మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఖైదీ సినిమా విడుదల అయ్యి మూడు సంవత్సరాలు కాబోతున్న ఈ సమయంలో మళ్లీ ఓటీటీ లో ఉన్న ఖైదీ సినిమా ను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారట. ఏ ఓటీటీ లో ఉందో చెక్‌ చేసి మరీ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఈమద్య కాలంలో ఖైదీ వ్యూస్‌ అనూహ్యంగా పెరిగాయని... డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ చేసిన మొదట్లో వచ్చిన వ్యూస్ కు ఇప్పుడు డబుల్‌ వచ్చాయంటూ సదరు ఓటీటీ వారి నుండి సమాచారం అందుతోంది.

ఉన్నట్టుండి ఖైదీ వెంట జనాలు పడటానికి కారణం ఏంటో అందరికి తెలిసిందే. ఇటీవల కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్‌ సినిమా లో కొన్ని సన్నివేశాలకు మరియు పాత్రలకు ఖైదీ సినిమా కథ మరియు పాత్రలను లింక్ చేయడం జరిగింది. అందుకే విక్రమ్‌ సినిమా చూడాలంటే మొదట ఖైదీ సినిమా చూడాలంటూ ప్రచారం కూడా జరిగింది.

ఖైదీ సినిమా చూసిన వారికి విక్రమ్‌ చాలా ఈజీగా అర్థం అవుతుంది.. థ్రిల్‌ ఫీల్‌ అవుతారు అంటూ సినిమాను చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీ ని చూసిన వారు విక్రమ్‌ లో ఆ సినిమా తాలూకు పాత్రలు సన్నివేశాలు వస్తూ ఉన్నప్పుడు థ్రిల్‌ ఫీల్‌ అవ్వడం జరుగుతుందట. అందుకే ఇప్పుడు ఖైదీ సినిమా ను చూసేందుకు జనాలు ఓటీటీ ముందు క్యూ కట్టారు అనడంలో సందేహం లేదు.

విక్రమ్‌ సినిమా చూసిన వారు కూడా కొందరు ఖైదీ సినిమా ఎలా ఉంటుంది.. అసలు ఇందులో ఉన్న పాత్రలకు అందులో ఉన్న కథకు పాత్రలకు సంబంధం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా ఖైదీని చూస్తున్నారట. మొత్తానికి విక్రమ్‌ సినిమా వల్ల ఖైదీ సినిమాను చాలా మంది ఇప్పుడు చూశారు. భవిష్యత్తులో రాబోతున్న ఖైదీ 2 కి కూడా విక్రమ్‌ మరియు ఖైదీ లతో సంబంధం ఉంటుంది.

కనుక ఖైదీ 2 సినిమా సమయంలో కూడా ఖచ్చితంగా మళ్లీ విక్రమ్‌ మరియు ఖైదీ సినిమా లను ఓటీటీ లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో లింక్ ను క్రియేట్‌ చేసి సినిమాలో చూపించడం వల్ల ప్రేక్షకులను థ్రిల్‌ చేయడంతో పాటు కొత్త అనుభూతి కలిగించే అవకాశం ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.