Begin typing your search above and press return to search.

'ఖిలాడి' డైరెక్టర్ తో పవన్ కల్యాణ్!

By:  Tupaki Desk   |   9 Feb 2022 11:30 AM GMT
ఖిలాడి డైరెక్టర్ తో పవన్ కల్యాణ్!
X
పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. ఒక్కో డైరెక్టర్ తో ఒక్కో జోనర్ కి సంబంధించిన కథలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నారు. అలా ఆయన మరో నిర్మాతతో చేయడానికి సుముఖతను వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆ నిర్మాత పేరు సత్యనారాయణ కోనేరు. సోషల్ మీడియాలో ఆయన పేరు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది .. ఆయన తాజా చిత్రమైన 'ఖిలాడి' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండటమే అందుకు కారణం. సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో చేయడానికి పవన్ ఓకే చెప్పాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

ఈ టాక్ దానంతట అది పుట్టింది కాదు. 'ఖిలాడి' ప్రమోషన్స్ లో నిర్మాత సత్యనారాయణ కోనేరు మాట్లాడుతూ, ఇటీవల తాను పవన్ కల్యాణ్ ను కలిసినట్టుగా చెప్పారు. ఆయనతో ఒక సినిమా చేయాలనుందని అంటే, అందుకు పవన్ సుముఖతను వ్యక్తం చేశారని అన్నారు. మంచి కథను రెడీ చేసుకుని పవన్ కి వినిపించే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు. ఈ ప్రమోషన్స్ లో ఆయన దర్శకుడు రమేశ్ వర్మ గురించి ఒక రేంజ్ లో చెప్పడమే కాకుండా, ఆయనకి ఒక కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే.

దీనిని బట్టి అంతా కూడా పవన్ తో సత్యనారాయణ కోనేరు చేయనున్న సినిమాకి రమేశ్ వర్మనే దర్శకుడు అని చెప్పుకుంటున్నారు. పవన్ కోసం మంచి కథను తయారు చేసి ఆయనకి వినిపించమని రమేశ్ వర్మతో సత్యనారాయణ కోనేరు చెప్పారనీ, ఆల్రెడీ ఆ పనిలోనే రమేశ్ వర్మ ఉన్నాడని అంటున్నారు. నిజానికి రమేశ్ వర్మ ఇంతకుముందు తెరకెక్కించిన సినిమాలలో బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' మినహా మిగతా సినిమాలేవీ అంతగా ఆడలేదు. 'రాక్షసుడు' కూడా రీమేక్. కానీ 'ఖిలాడి' విషయంలోనే ఆయన నిర్మాత నమ్మకాన్ని సంపాదించుకున్నాడని అంటున్నారు.

రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథను ఎంచుకోవడంలో .. అందుకు తగిన సన్నివేశాలను రాసుకోవడంలో .. రవితేజ మార్క్ డైలాగులను సెట్ చేసుకోవడంలో రమేశ్ వర్మ చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నుంచి ట్రైలర్ వదిలిన తరువాత మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజంగానే ఆ జాబితాలో ఈ సినిమా చేరితే పవన్ తో సినిమా చేయడం మరింత తేలిక అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

'భీమ్లా నాయక్' సినిమాను విడుదల దిశగా నడిపిస్తున్న పవన్, 'హరి హర వీరమల్లు' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం దర్శకుడు క్రిష్ భారీ సెట్లను రెడీ చేయిస్తున్నారు. ఆ తరువాత పవన్ తో సెట్స్ పైకి వెళ్లడానికి హరీశ్ శంకర్ కాచుకుని కూర్చున్నాడు. 'గబ్బర్ సింగ్' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.

ఆ తరువాత సినిమాను సురేందర్ రెడ్డితో చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నాడు. అయితే అప్పటికి సురేందర్ రెడ్డి సిద్ధంగా లేకపోతే రమేశ్ వర్మను తీసుకుని పవన్ సెట్స్ పైకి వెళ్లిపోతారు. లేదంటే సురేందర్ రెడ్డి ప్రాజెక్టును పవన్ పూర్తిచేసేవరకూ రమేశ్ వర్మ వెయిట్ చేయవలసిందే. ఆ గ్యాప్ లో రమేశ్ వర్మ పవన్ స్క్రిప్ట్ కి నగిషీలు దిద్దుతూ కూర్చుంటాడా? లేదంటే వేరే హీరోతో వేరే కథను సెట్ చేసుకుని పవన్ సినిమా సమయానికి అందుకుంటాడా? అనేది చూడాలి. ఇదంతా కూడా 'ఖిలాడి' రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.