Begin typing your search above and press return to search.

పవన్-చిరు వ్యూహం ఫలించిందన్నమాట

By:  Tupaki Desk   |   15 April 2016 1:00 PM IST
పవన్-చిరు వ్యూహం ఫలించిందన్నమాట
X
మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా వేడుక జరిగిందంటే చాలు.. అతిథులందరూ బెంబేలెత్తిపోయేలా ఓ వర్గం అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించేసేవారు కొన్ని నెలల కిందటి వరకు. ముందు ఈ గోలను పెద్దగా పట్టించుకునే వారు కాదు కానీ.. కొన్నాళ్ల తర్వాత మరీ శ్రుతి మించిపోవడంతో మెగా ఫ్యామిలీ హీరోలకు చిరాకొచ్చేసింది. నాగబాబు కోపం ఆపుకోలేక ఓసారి పవన్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డాడు కూడా. అయినా పవన్ అభిమానుల తీరు మారలేదు. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగాడు. చిరంజీవిని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు పిలిచి.. తనకు, అన్నయ్యకు ఏ విభేదాలు లేవని.. అన్నయ్య తన దైవం అని సభాముఖంగా ప్రకటించాడు. చిరు కూడా ఈ విషయంలో పవన్ కు బాగానే సహకరించాడు.

మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిసి నడిపిన ఈ వ్యూహం బాగానే పని చేసినట్లుంది. మొన్న ‘సరైనోడు’ ఆడియో సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ నినాదాలు పెద్దగా వినిపించలేదు. పవన్ ప్రస్తావన వచ్చినపుడు ఉత్సాహం చూపించారు తప్ప.. అతిథుల ప్రసంగాలకు పవన్ నినాదాలతో అడ్డు తగల్లేదు ఎవ్వరూ. అయినా ఆ వేడుక జరిగింది వైజాగ్ లో.. అది కూడా ఓపెన్ ప్లేస్ లో కాబట్టి దాన్ని పక్కనబెట్టేద్దాం. తాజాగా ‘సుప్రీమ్’ ఆడియో వేడుకలో కూడా ఇలాంటి ఇబ్బందేమీ కనిపించలేదు. పవర్ స్టార్ నినాదాలు పెద్దగా వినిపించలేదు. కాబట్టి చిరు-పవన్ వ్యూహం ఫలితాన్నిచ్చిందనే అనుకోవాలి. కాకపోతే నాగబాబు మీద పవన్ అభిమానులకు కోపం ఉంది కాబట్టి.. వరుణ్ తేజ్ సినిమా వస్తే మళ్లీ ఈ గోల మొదలుపెడతారేమో చెప్పలేం. ప్రస్తుతానికైతే పవన్ ఫ్యాన్స్ అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తున్నారు.