Begin typing your search above and press return to search.

క్రియేటివ్ డైరెక్టర్ ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుందా?

By:  Tupaki Desk   |   12 Aug 2021 5:16 AM GMT
క్రియేటివ్ డైరెక్టర్ ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుందా?
X
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఇటీవ‌ల చాలా కాలంగా రేసులో వెన‌క‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. సింధూరం- నిన్నే పెళ్లాడుతా-ఖ‌డ్గం-చంద‌మామ‌- మురారి లాంటి క్లాసిక్స్ ని తెర‌కెక్కించిన కృష్ణ‌వంశీ ఆ త‌ర్వాత ఎందుక‌నో ఆ స్థాయి క్వాలిటీ ప్రొడ‌క్ట్ ని ఇవ్వ‌డంలో త‌డ‌బ‌డ్డారు. రామ్ చ‌ర‌ణ్ `గోవిందుడు అంద‌రివాడేలే` చిత్రంతో కంబ్యాక్ అవ్వాల‌న్న ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మైంది.

ప్రస్తుతం అత‌డు కొంత గ్యాప్ త‌ర్వాత‌ మరాఠీ చిత్రం నటసామ్రాట్ అధికారిక రీమేక్ `రంగ మార్తాండ`ను తెర‌కెక్కిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇటీవ‌ల అత‌డు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత నెక్ట్స్ ఏంటి? అన్న డైల‌మా నుంచి అత‌డు బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్నారు. చాలా కాలంగా రైతు అనే స్క్రిప్టును రెడీ చేసుకుని అత‌డు స్టార్ హీరోల వెంట ప‌డుతున్నా ఏదీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌కు స్క్రిప్టు న‌చ్చింద‌ని కూడా ప్ర‌చార‌మైంది. కానీ అదీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. బాల‌య్య ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు క‌మిట్ మెంట్లు ఇచ్చేశారు.

తాజా స‌మాచారం మేర‌కు.. జూనియర్ ఎన్టీఆర్ కి ఈ స్క్రిప్టును వినిపించాల‌నే ఆలోచ‌న‌తో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ఉన్నార‌ని తెలిసింది. అయితే తేదీల లభ్యత అంత సులువేమీ కాద‌ని గ్ర‌హించిన కృష్ణ‌వంశీ కాల్షీట్ల‌ గురించి ఆరా తీసేందుకు ఎన్టీఆర్ బృందాన్ని సంప్రదించాడని సమాచారం. తార‌క్ తో కృష్ణ‌వంశీకి చ‌క్క‌ని అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణ వంశీ ఇద్దరూ గతంలో రాఖీ(2006) సినిమా కోసం పనిచేశారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్ కుద‌ర‌లేదు. ఇప్పుడు కృష్ణ వంశీ రైతు స్క్రిప్ట్ మీద మ‌రోసారి రీవ‌ర్క్ చేస్తున్నాడు. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని.. అనీల్ రావిపూడి వంటి డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తున్నారు. త‌దుప‌రి త‌న‌యుడి ఎంట్రీ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ పై దృష్టిసారిస్తారు. ఇలాంటి టైమ్ లో కృష్ణ‌వంశీకి చిక్క‌డం అంత సులువేమీ కాదు. అందుకే అత‌డు తార‌క్ కానీ ఎవ‌రైనా స్టార్ హీరో అయినా కానీ రైతు స్క్రిప్టుకి ఓకే చెబుతార‌నే హోప్ తో ఉన్నార‌ట‌.

తార‌క్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీ. ప్రస్తుతం RRR చిత్రంతో చివ‌రి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ లో బిజీగా ఉన్నారు. దీని తరువాత ప్రశాంత్ నీల్- కొరటాల శివ -బుచ్చి బాబు సనా- త్రివిక్ర‌మ్ ల‌తో కలిసి పని చేస్తాడు. ఇవ‌న్నీ పూర్త‌వ్వాలంటే ఇంకో రెండేళ్లు ఆగాల్సి ఉంటుందేమో! కృష్ణ వంశీ తెర‌కెక్కించిన రంగ మార్తాండ‌ ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుంది.

కంబ్యాక్ ఎప్ప‌టికి స‌ర్?

కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన మ‌హాత్మ‌- పైసా లాంటి చిత్రాలు కీల‌క స‌మ‌యంలో బోల్తా కొట్ట‌డం కూడా అత‌డి కెరీర్ కి పెద్ద మైన‌స్ అయ్యింది. మహాత్మ‌కు అవార్డులొచ్చినా డ‌బ్బులు రాలేదు. నాని లాంటి హీరోతో పైసా చిత్రం చేసినా అది చెత్త సినిమాగా నిలిచింది. ఏ సినిమా చేసినా కృష్ణ‌వంశీ త‌న మార్క్ ని మిస్స‌య్యార‌న్న‌ విమ‌ర్శ‌లొచ్చాయి. అందుకే అత‌డు తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రంగ మార్తాండ ఇలాంటి ప్ర‌య‌త్న‌మే. ఏది ఏమైనా రంగ‌మార్తాండ కీల‌క సినిమా. ఇందులో ర‌మ్య‌కృష్ణ స‌హా గొప్ప న‌టీన‌టులు ఉన్నారు. ఇది బ్రేక్ ఇస్తే తదుపరి రైతు స్క్రిప్టు ముందుకెళుతుంది. ఎవ‌రైనా హీరో అంగీక‌రించేందుకు స్కోప్ ఉంటుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.