Begin typing your search above and press return to search.

భ‌విష్య‌త్ లో `సూప‌ర్ థియేట‌ర్ల‌`కు మాత్ర‌మే మ‌నుగ‌డ‌!- డి.సురేష్ బాబు

By:  Tupaki Desk   |   18 July 2021 11:27 AM GMT
భ‌విష్య‌త్ లో `సూప‌ర్ థియేట‌ర్ల‌`కు మాత్ర‌మే మ‌నుగ‌డ‌!- డి.సురేష్ బాబు
X
సినిమా అంటే సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఇంత‌కుముందులా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే వ‌ర‌కూ ఆగి చూసే వినోద సాధ‌నం కాదా? ఇప్పుడు అది దిశ‌ను మార్చుకోబోతోందా? సినిమా వీక్ష‌ణ అమాంతం మార‌బోతోందా? సాంప్ర‌దాయ ద‌శ నుంచి సృజ‌నాత్మ‌క పంథాలోకి వెళ్ల‌నుందా? అంటే .. ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికి ఇండ‌స్ట్రీ డీన్ డి.సురేష్ బాబు స‌రైన జ‌వాబు ఇచ్చారు. ఇక‌పై సినిమాని రెగ్యుల‌ర్ థియ‌యేట‌ర్ల‌లోకి వెళ్లి వీక్షించాల‌నే ఆస‌క్తి ఉండ‌క‌పోవ‌చ్చున‌ని అన్నారు. ఇక‌పై సినిమా అంటే సూపర్ స్క్రీన్ థియేట‌ర్స్ కి మాత్ర‌మే వెళ‌తార‌ని ఆయ‌న చాలా ముంద‌స్తు ఆలోచ‌న‌ను సూచ‌న‌ను ఆవిష్క‌రించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక‌పై పెద్ద పెద్ద క్ల‌బ్ హౌస్ ల‌లోనూ .. గ్రూప్ హౌస్ ల‌లోను 50 సీట‌ర్ థియేట‌ర్లు వ‌చ్చేస్తాయ‌ని అక్క‌డ వ్యూవ‌ర్ షిప్ స‌రిపోతుంద‌ని కూడా విశ్లేషించారు. ఇటీవ‌ల ఆన్ లైన్ అందుబాటులోకి రావ‌డంతో బ్యాంకింగ్ విధానం కూడా మారిపోయింద‌ని మునుముందు బ్యాంకులు ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తుల‌ను ప్ర‌వేశ పెడ‌తాయ‌ని వాటి కోసం జ‌నాల్ని ఆక‌ర్షించేందుకు బ్యాంకుల్లోనే థియేట‌ర్ల‌ను ర‌న్ చేస్తాయ‌ని కూడా ఆయ‌న ముంద‌స్తు ఆలోచ‌న‌ను షేర్ చేసుకున్నారు.

వెంకటేశ్ న‌టించిన నార‌ప్ప‌ ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఇంకా ఆయ‌న చాలా విష‌యాల్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.

నారప్ప చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయ‌డానికి కార‌ణం చెబుతూ..ఈ సినిమాను కలైపుతి యస్‌. థాను తో కలిసి నిర్మించాము. ఈ ఏడాది ఏప్రిల్ లో ధనుష్ కర్ణన్‌ సినిమాను థానుగారు విడుదల చేశారు. విడుదలైన మొదటివారంలో 100 శాతం ఆక్యూపెన్సీతో ఉన్న థియేటర్స్‌ కోవిడ్‌ కారణంగా 50 శాతానికి పడిపోయాయి. ఆ నెక్ట్స్‌ వెంటనే సినిమాను తీసేశారు. దానివల్ల థానుగారు దాదాపు 10 కోట్లు నష్టపోయారు. అందుకని ఆయన ఆందోళనకు గురయ్యారు. ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకున్నప్పుడు కోవిడ్ ఉదృతీ చాలా ఎక్కువగా ఉంది. థియేటర్స్‌ ఎప్పుడు రీ ఓపెన్‌ అవుతాయో తెలియదు. ఒకవేళ ఓపెన్‌ అయినా ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో తెలియదు. ఇన్ని కారణాల వల్ల నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తుంది... అని తెలిపారు.

థియేట‌ర్ రంగంపై టెక్నాల‌జీ ప్ర‌భావం గురించి మాట్లాడుతూ.. థియేటర్స్‌లో సినిమాలను విడుదల చేయడానికే 1964లో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్టార్ట్‌ చేశాం. ఆ తర్వాత శాటిలైట్‌ వచ్చింది. ఆ నెక్ట్స్‌ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌. ఇప్పుడు మల్టీఫుల్‌ మార్కెట్స్‌ ఉన్నాయి. వీటిలో ఒక ఆప్షన్‌ ఓటీటీ. మనం ఓటీటీని ఆపేయగలమని నేను అనుకోవడం లేదు. కానీ కోవిడ్‌ రాకపోయిఉంటే మాత్రం ఓటీటీ ఇంత పాపులర్‌ అయ్యి ఉండేది మాత్రం కాదు. ఓటీటీ వల్ల స్టూడియోస్ లో వర్క్‌ పెరుగుతుంది. ఆర్టిస్టులు టెక్నికల్ డబ్బింగ్‌ ఇలా అన్ని
సెక్టార్స్‌ వారికి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఎగ్జిబిటర్స్‌ వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. భవిష్యత్ లో ఓటీటీ హై క్వాలిటీ థియేటర్స్‌ మాత్రమే ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి..

నారప్ప సినిమా థియేటర్స్ లో విడుదల కానందుకు వెంకటేశే కాదు నేను ఫీల్‌ అవుతున్నాను. అభిమానులు బాధపడుతున్నారు. కానీ మనం లైఫ్‌లో ప్రాక్టీకల్‌గా ఉండక తప్పదు. ‘నారప్ప’ సినిమా నాదే అయితే కచ్ఛితంగా ఓటీటీలో విడుదల చేసేవాణ్ణి కాదు. నాకు పార్ట్‌నర్స్‌ ఉన్నారు. వారి ఆర్థిక సౌకర్యాలు లబ్ధిని నేను ఆపలేను. ఎగ్జిబిటర్స్‌ సమస్యలను నేను అర్థం చేసుకోగలను. బాధగానే ఉంది. కానీ నా భాగస్వామ్యులను ఇబ్బంది పెట్టలేను. ప్రపంచలోనే అతి పెద్ద ప్రొడక్షన్‌ సంస్థ డిస్నీ కూడా తన సినిమాలను ఏకకాలంలో ఓటీటీ, థియేటర్స్ లో విడుదల చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్‌ సినిమా కూడా ఇదే ఫార్మాట్ లో విడుదలైంది. ఒకవేళ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మా సినిమా విడుదలవడం వల్ల మాకు లాభం వస్తే ఆ డబ్బులను మేం మళ్లీ ఇండస్ట్రీలోనే పెడుతున్నాం. భవిష్యత్ లో 50 సీట్లతో ఉన్న థియేటర్స్‌ సహా ఎంటర్ టైన్ మెంట్‌ రంగంలో భారీ మార్పులు వస్తాయి.. అని తెలిపారు.

నేటివిటీ క‌థ‌లను రాయ‌రు:

నారప్ప లాంటి కథలను ఎవరూ వెంకటేశ్‌ కోసం రాయరు. ఈ సినిమాలో వెట్రిమారన్‌ స్టైల్‌ నాకు నచ్చింది. మాస్‌ ఎలిమెంట్స్ తో పాటు భారీ ఫ్యామిలీ ఎమోషన్స్ సామాజిక అంశాలు ఉన్నాయి. సో.. ఈ సినిమా వర్కౌట్‌ అవుతుందని అనిపించింది. యాక్టర్‌గా వెంకటేశ్‌ చాలా బాగా చేశాడు. ఇంట్రవెల్ కు ముందు ఇసుకలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌తీశాం. అది చాలా కష్టం. వెంకటేశ్‌ అయితే చాలా సిన్సియర్‌గా వర్క్‌ చేశాడు. ఎప్పుడు నారప్ప గెటప్‌లోనే కనిపించారు. బ్యాలెన్స్‌ షూట్‌ కోసం మెంటల్‌గా ప్రిపేర్‌ అయ్యాడు. నారప్ప సినిమా రైట్స్‌ తీసుకున్న తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల ఓ సారి వచ్చి ఓ కథ చెప్పారు. ఆ తర్వాత నారప్ప సినిమా గురించి మాట్లాడుకున్నాం. శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్ట్‌ చేస్తానన్నారు. చాలా బాగా తెరకెక్కించారు.

కోవిడ్ భ‌యంతో ప‌ని చేశాం:

నారప్ప సినిమా షూట్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత కొంత భయాందోళనకు గురైయ్యాం. ఫస్ట్‌ షెడ్యూల్‌ 52 రోజుల పాటు చేసి పక్క ఊరిలో కోవిడ్‌ వచ్చిందని సినిమా షూట్‌ను ఆపేశాం. చాలా భయం భయంగానే ఈ సినిమాను చేశాం. ‘నారప్ప’ నాన్‌ షూటింగ్‌ టైమ్ లో ఈ సినిమాకు సంబంధించిన నలుగురు చనిపోయారు.

మ్యూజిక్ రంగంలోనూ..

ఎస్పీ మ్యూజిక్ ను లాంచ్‌ చేశాం. ఇందులో ఫిల్మీ మ్యూజిక్ తో పాటు ఇతర మ్యూజిక్ వీడియోలు కూడా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ గుంటూరు వంటి ప్రదేశాల్లో చిన్న చిన్న స్డూడియోలను స్టార్ట్‌ చేసి కొత్తవారిని ప్రొత్సహించాలనుకుంటున్నాం. రీమేక్‌ సినిమా చేస్తున్నప్పుడు ఓరిజినల్‌ మ్యూజిక్ కు ఎక్కువమంది కనెక్ట్ అయ్యి ఉంటారు.