Begin typing your search above and press return to search.

ప్రభాస్ లాంటి మంచి వ్యక్తి ఈ ప్రపంచంలోనే మరొకరు లేరు..!

By:  Tupaki Desk   |   25 Dec 2021 10:37 AM GMT
ప్రభాస్ లాంటి మంచి వ్యక్తి ఈ ప్రపంచంలోనే మరొకరు లేరు..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ''ఆదిపురుష్'' అనే పౌరాణిక స్ట్రెయిట్ హిందీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్.. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. టీ సిరీస్ బ్యానర్ మీద భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే 'ఆది పురుష్' సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో 3డీ టెక్నాలజీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. 'తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' వంటి చారిత్రాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ ఓం రౌత్.. ''ఆదిపురుష్'' సినిమాని విజువల్ వండర్ గా ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నారు.

ఇటీవల 'రాధే శ్యామ్' ట్రైలర్ లాంచ్ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఓం రౌత్.. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''ఆది పురుష్'' సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ స్క్రిప్ట్ రాసుకున్నాక రాముడిగా తనకు ప్రభాస్ రూపం మాత్రమే కనిపించిందని.. ఒకవేళ ఆయన ఈ పాత్ర చేయనంటే తాను అసలు ఈ సినిమా చేసేవాడిని కాదని బాలీవుడ్ దర్శకుడు తెలిపారు.

''ఆది పురుష్ పాత్ర చేయాలంటే స్వచ్ఛమైన మనసు.. స్వచ్ఛత.. కల్మషంలేని వ్యక్తిత్వం ఉండాలి. ఈ లక్షణాలన్నీ నాకు ప్రభాస్ లోనే కనిపించాయి. అందుకే ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేదు. నిజంగా కథ విన్నాక ప్రభాస్ గారు సినిమా చేయలేనని చెబితే.. ఈ స్క్రిప్ట్ ను పక్కకు పెట్టేద్దామనుకున్నా. అదృష్టవశాత్తూ నాకు అలాంటి అవకాశం ఇవ్వలేదు'' అని ఓం రౌత్ చెప్పారు.

''ప్రభాస్ లాంటి మంచి వ్యక్తి ఇండస్ట్రీలోనే కాదు.. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే మరొకరు లేరు. ఆయన బలం బలహీనత మంచితనమే. సెట్లో చాలా జోవియల్ గా ఉంటూ.. అందరినీ నవ్విస్తుంటారు. ఆయనతో వర్క్ చేయడం ఏ దర్శకుడికైనా ఈజీగా ఉంటుంది. సినిమా చేసే క్రమంలో మేమంతా ఓ ఫ్యామిలీగా మారిపోయాం'' అని ఓం రౌత్ అన్నారు. 'ఆది పురుష్' కోసం చాలా కష్టపడ్డామని.. ఈ కథతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని తెలిపారు.

ఇంకా ఓం రౌత్ మాట్లాడుతూ.. ''ఇప్పటి వరకు రామాయణం మీద వచ్చిన సినిమాల కంటే కొత్తగా తానేమి చూపించానన్నది తెరపై చూస్తే అర్థమవుతుంది. దాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. 7 వేల ఏళ్ల క్రితం జరిగిన కథని.. వాల్మీకి రామాయణాన్ని నా శైలిలో చూపిస్తున్నాను. అలా అని ఇందులో మొత్తం రామాయణాన్ని చూపించడం లేదు. అంత పెద్ద ఇతిహాసాన్ని మూడు గంటల్లో చూపించడం చాలా కష్టం. అందుకే రామాయణంలోని ఓ కీలక భాగాన్నే ‘ఆదిపురుష్’ లో చూపిస్తున్నాం. అదేంటనేది నేనిప్పుడే చెప్పను.. తెరపై చూడాల్సిందే. ఇందులో అద్భుతమైన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. వాటిని ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని అన్నారు.

''ఆదిపురుష్ కథకు తగ్గట్లుగా అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుతున్నాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం.. సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి బడ్జెట్ ఎక్కువ అయినా కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ముందుగా చెప్పిన తేదీకే సినిమాని విడుదల చేస్తాం'' అని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.