Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పాత సినిమా కోసం `కార్తికేయ 2`ను ఆపుతారా?

By:  Tupaki Desk   |   30 Aug 2022 6:34 AM GMT
ప‌వ‌న్ పాత సినిమా కోసం `కార్తికేయ 2`ను ఆపుతారా?
X
ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో 'కార్తికేయ 2' ఒక‌టి. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించారు. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ నిర్మించారు. అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య మీనమ్‌, కేఎస్‌ శ్రీధర్‌, శ్రీనివాస రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అనేక అడ్డంకుల‌ను దాటుకుని ఆగ‌స్టు 13న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. టాక్ బాగుండ‌టంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపే వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ దూసుకుపోతోంది. రూ. 13.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. 16 రోజుల్లో రూ. 48.78 కోట్ల షేర్ ను రాబ‌ట్టి డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ లిస్ట్ లో చేరిపోయింది.

మూడో వారంలోనూ సెన్సేషనల్ కలెక్షన్స్ తో పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తోందంటే.. ఈ మూవీ స‌త్తా ఏంటో స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇలాంటి సినిమా ప్రదర్శనను థియేట‌ర్ లో ఆపేయ‌బోతున్నార‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది కూడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత సినిమా కోస‌మ‌ని అంటున్నారు.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అభిమానుల కోరిక మేర‌కు ఒక రోజు ముందు అంటే సెప్టెంబ‌ర్ 1న 'జ‌ల్సా' సినిమాను 4కె రెసొల్యూషన్ తో రీ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో ఇలియానా హీరోయిన్ గా న‌టించింది.

'ఖుషీ' వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత ఐదు ఫ్లాపులను చవి చూసిన‌ పవన్ కళ్యాణ్.. 2008లో రిలీజ్ అయిన 'జ‌ల్సా'తో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీ అప్ప‌ట్లో ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది. అటువంటి చిత్రాన్ని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం రీ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

సుమారు 500 షోస్ వేసేలా నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే నిఖిల్ సెప్టెంబర్ 1 న హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో 'జల్సా' రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా కార్తికేయ 2 ప్రదర్శనను ఆపుకుంటున్న‌ట్లు ఓ వార్త బ‌య‌టకు వ‌చ్చింది. ఇంద‌కు కార‌ణం లేక‌పోలేదు. ప‌వ‌న్ ను అమితంగా అభిమానించే వారిలో హీరో నిఖిల్ కూడా ఒక‌రు.

ఆ కార‌ణంతోనే నిఖిల్ త‌న అభిమాన హీరో సినిమా రీ రిలీజ్ కోసం త‌న సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆపుతున్న‌డ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప‌వ‌న్ అభిమానులు నిఖిల్ గొప్ప మ‌న‌సుపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ.. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.