Begin typing your search above and press return to search.

#NTR 31 టైటిల్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత...?

By:  Tupaki Desk   |   12 Jun 2020 12:10 PM GMT
#NTR 31 టైటిల్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత...?
X
ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. యాక్టింగ్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీ - ఫైట్స్‌ ఇలా అన్నిట్లో రాణిస్తూ అదరగొడుతున్నాడు. కొన్నేళ్లుగా సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' లో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు తారక్. 'ఆర్.ఆర్.ఆర్' తరువాత ఎన్టీఆర్ తన కెరీర్లో 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎన్టీఆర్ కి స్టోరీ కూడా చెప్పేసాడని న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే దానికి సంభందించిన అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బర్త్ డే నాడు ప్రశాంత్ నీల్ ట్వీట్ ద్వారా వీరి కాంబోలో మూవీ ఉంటుందని సినీ అభిమానులు కంఫర్మ్ చేసుకున్నారు. 'మీరు పక్కనుంటే న్యూక్లియర్‌ ప్లాంట్‌ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో రేడియేషన్‌ సూట్‌ ధరించి మీ వద్దకు రాబోతున్నా' అని ప్రశాంత్‌ నీల్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఇటీవలే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ 'గొప్ప మనసు కలిగిన సంచలన దర్శకుడికి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్‌ సూట్‌ లో కలవబోతున్నాం' అని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ సినిమాకు 'రేడియేషన్' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. అంతేకాకుండా 'మిస్సైల్' 'న్యూక్లియర్' అనే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారంటూ స్టోరీలు అల్లేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో నిజం లేదంట. 2022లో స్టార్ట్ అవబోయే సినిమాకి అప్పుడే టైటిల్ ఫైనలైజ్ చేసే ఆలోచన లేదని చిత్ర వర్గాలు అంటున్నాయట. ఇంకా ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ మీద ప్రశాంత్ కూర్చోలేదని.. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం 'కేజీఎఫ్ 2' మీదే ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా 'ఆర్.ఆర్.ఆర్' కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.