Begin typing your search above and press return to search.

జక్కన్న నన్ను చూసి అసహ్యంగా ఉన్నావని అన్నాడు: ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   2 Sep 2021 2:30 AM GMT
జక్కన్న నన్ను చూసి అసహ్యంగా ఉన్నావని అన్నాడు: ఎన్టీఆర్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలో బొద్దుగా ఉండేవాడనే సంగతి అందరికీ తెలిసిందే. లావుగా ఉన్నప్పటికీ తారక్ లో గ్రేస్ తగ్గలేదు.. డ్యాన్స్‌ లో స్పీడ్ తగ్గలేదు. అదే ఫిజిక్ తో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అయితే 'రాఖీ' చిత్రంలో ఎన్టీఆర్ శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. ఆ తర్వాత 'యమదొంగ' సినిమా సమయానికి సన్నగా కంప్లీట్ మేకోవర్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో లో ఎలాంటి మొహమాటం లేకుండా తన శరీర బరువు గురించి దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షో లో ఒక కంటెస్టెంట్‌ బట్టతల కారణంగా ఆత్మన్యూనత భావానికి గురయ్యేవాడినని, అందరూ నెగెటివ్ కామెంట్స్‌ చేయడం వల్ల బాధపడేవాడినని చెప్పాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటింది. మొదట్లో చాలా లావుగా ఉండేవాడిని. కానీ ఏ రోజూ లావుగా ఉన్నానని నాకు అనిపించలేదు. ఒకరోజు మా జక్కన్న నన్ను చూసి అసహ్యంగా ఉన్నావు అన్నారు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. మన చుట్టూ ఉన్న స్నేహితులే మనల్ని మార్గనిర్దేశం చేస్తారు. అలాంటివాళ్లే మన నిజమైన స్నేహితులు. ఆ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. మీది జుట్టు ప్రాబ్లమ్.. నాది కొవ్వు ప్రాబ్లమ్.. అంతే తేడా'' అని చెప్పుకొచ్చారు.

ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'నటనలో రాణించాలంటే మనకు కావాల్సింది నిజాయతీ. మనకు చాలా తెలుసు అనుకుంటాం. కానీ మనకు ఏదీ తెలియదు. ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు తెలియనివి జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మనకు చాలా తెలుసని ధైర్యంతో ఉంటాం. మన కోరిక వైపు చాలా బలంగా ప్రయాణించాలి. అప్పుడే మన కల నెరవేరుతుంది. మీ కల తప్పకుండా నేరవేరుతుంది'' అని పేర్కొన్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ ఈ షో లో తన వ్యక్తిగత విషయాలు.. లావుగా ఉండటం చూసి రాజమౌళి అన్న మాటలను దాచుకోకుండా చెప్పి అందరి హృదయాలు గెలుచుకున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కొమరం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నారు. దీని కోసం మరో హీరో రామ్‌ చరణ్‌ తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి కూడా ఎన్టీఆర్ వెనుకాడలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దీని తర్వాత కొరటాల శివ - ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారు.