Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 31పై ఎందుకంత క్రేజ్...?

By:  Tupaki Desk   |   9 May 2020 2:30 AM GMT
ఎన్టీఆర్ 31పై ఎందుకంత క్రేజ్...?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ఎన్టీఆర్. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. 'టెంపర్‌'తో మొదలు పెట్టిన జైత్రయాత్ర 'నాన్నకు ప్రేమతో' 'జనతా గ్యారేజ్' 'జై లవకుశ' 'అరవింద సమేత వీర రాఘవ' వరకు కొనసాగించింది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమాలో నటిస్తున్నాడు. తారక్ ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి కూడా వెనుకాడలేదు. ఎన్టీఆర్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన కెరీర్లో 30వ చిత్రాన్ని ఓకే చేసాడు తారక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తవకముందే ఎన్టీఆర్ తదుపరి 31వ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు సినీ అభిమానులు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఏ వెబ్ మీడియాలో చూసినా ఎన్టీఆర్ 31 సినిమాపై అప్డేట్ ఇస్తున్నాయి.

ఎన్టీఆర్ 31వ సినిమాపై ఇంత క్రేజ్ ఏర్పడటానికి కారణం లేకపోలేదు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న 'ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరబోతోంది. ఇప్పటి వరకు తారక్ తెలుగు హీరో మాత్రమే.. కానీ జక్కన్న ట్రిపుల్ ఆర్ తర్వాత ఖచ్చితంగా ఈయన నేషనల్ వైడ్ స్టార్ హీరో అయిపోతాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా స్థాయిలో వర్కవుట్ అయ్యే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అవకాసం వస్తే ఇతర భాషల భారీ చిత్రాల్లోనూ నటించటానికి ఉత్సాహం చూపిస్తుస్తున్నారు. మార్కెట్ పెరిగేందుకు ఏయే మార్గాలు ఉన్నాయో అవన్నీ అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా తాను నటించే అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే ఓకే చేసిన త్రివిక్రమ్ మూవీని కూడా ఆ దిశగా నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో తదుపరి సినిమా విషయంలో తారక్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తాడో అని అందరిలో కుతూహలం మొదలైంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అగ్ర దర్శకులు వెయిట్ చేస్తున్నారు. వారిలో తమిళ స్టార్ డైరెక్టర్ గా ఉన్న అట్లీ, కన్నడ స్టార్ డైరెక్టర్ 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉన్నారని సమాచారం. వైజయంతీ మూవీస్ అశ్వినీ దత్ అట్లీ - ఎన్టీఆర్ కాంబోలో మూవీ చేయాలని గట్టి ప్రయత్నాలలో ఉన్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో ఓ భారీ పీరియాడికల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అయితే ఈ ముగ్గురిలో ఓ దర్శకుడితో ఎన్టీఆర్ 31వ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఎన్టీఆర్ ఓకే చేసిన రెండు సినిమాలు రిలీజ్ కాకముందే ఎన్టీఆర్ 31 సినిమాపై క్రేజ్ మాములుగా లేదని చెప్పవచ్చు.