Begin typing your search above and press return to search.

ఎంత స్పీడ్ గా వచ్చారో.. అంతే స్పీడ్ గా జంప్

By:  Tupaki Desk   |   21 March 2020 12:30 AM GMT
ఎంత స్పీడ్ గా వచ్చారో.. అంతే స్పీడ్ గా జంప్
X
సినిమా అనేది ఓ మ్యాజిక్. ఎప్పుడు ఎవరు ఓవర్‌ నైట్ లో స్టార్‌ అవుతారో.. ఎవరు ఎందుకు ఫేడవుట్‌ అవుతారో కొన్ని సార్లు అర్థం కాదు. ప్రతిభ ఉండీ రాణించలేక ఇబ్బంది ప‌డిన వారిని ఇక్క‌డ‌ చూస్తుంటాం. ఇక హీరోయిన్ల విషయంలో ఇది తరచూ జరుగుతుంది. ఏడాదికి ఇరవై నుంచి ముప్పై మంది కొత్త భామలు తెలుగు తెరకి పరిచయం అవుతున్నా.. అంత‌మందిలో ఎక్కువ భాగం ఒక‌ట్రెండు సినిమాకే పరిమితమవుతుంటారు. కాస్త పెద్ద హీరోలతో చేసిన హీరోయిన్లకి.. సక్సెస్‌ సాధించిన అమ్మాయిలకు ఛాన్స్ లు వస్తుంటాయి. మొత్తంగా ముగ్గురు నలుగురు పెద్ద రేంజ్ కి వెళ్లేవారుంటారు. కొంత మంది ఎంత వేగంగా వస్తారో.. అంతే వేగంగా బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ వెళ్ళిపోతారు. అలాంటి కథానాయికలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు సినిమాలతో ఓ మెరుపు మెరిసి.. అంతే వేగంగా అదృశ్యమయిన నాయిక‌ల జాబితాపై ఓ లుక్కేస్తే..

ప్రగ్యాజైశ్వాల్‌.. ఈ జబల్‌పూర భామ 2014లో `డేగ` అనే చిత్రంతో ఒకేసారి తెలుగు- తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ రూపొందించిన `కంచె` సినిమాతో పాపులర్‌ అయ్యింది. స్టార్‌ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. `ఓం నమో వెంకటేశాయ`.. `గుంటూరోడు`.. `నక్షత్రం` ఫెయిల్యూర్స్ దెబ్బకి అడ్రెస్‌ లేకుండా పోయింది. 2018లో నటించిన `ఆచార్య అమెరికా యాత్ర` కూడా పరాజయం చెందడంతో ఆమెకు అవకాశాలు త‌గ్గిపోయాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటూ హాట్‌ హాట్‌ ఫోటోలతో పోజులిస్తుంది.

2010లో వచ్చిన `లీడర్‌` చిత్రంతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది బెంగాలీ సోయగం రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత `మిరపకాయ్‌`, `నాగవల్లి`, `సారొచ్చారు`, `మిర్చి`, `భాయ్‌` చిత్రాల్లో మెస్మరైజ్‌ చేసింది. `భాయ్‌` తర్వాత పై చదువుల కోసం ఫారెన్‌ వెళ్ళింది. దీంతో ఛాన్స్ లు ఆగిపోయాయి. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకున్నా, ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై ప్రైవేట్‌ జాబ్‌ చేసుకుంటోంది. ఇక లీడ‌ర్ తోనే ప‌రిచ‌య‌మైన ప్రియా ఆనంద్ కోలీవుడ్ లో న‌టిస్తూనే ఫేడ‌వుట్ అయ్యింది ఎందుక‌నో.

2010లో `వేదం' సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది ఢిల్లీ భామ దీక్షా సేత్‌. `మిరపకాయ్‌`, `వాంటెడ్‌`.. `నిప్పు`.. `ఊ కొడతారా ఉలిక్కిపడతారా`.. `రెబెల్‌` చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. కానీ దాదాపు ఈ సినిమాలన్నీ పరాజయం చెందడంతో తెలుగులో ఛాన్స్ లు తగ్గాయి. క్రమంగా హిందీపై ఫోకస్‌ పెట్టి మూడు సినిమాలు చేసింది. 2016లో నటించిన `సాత్‌ కదమ్‌` సైతం డిజాస్టర్ గా మిగలడంతో నిరాశ చెందిన దీక్షా సినిమాలకు దూరంగా ఉంది. అదే సమయంలో ఆమెకు ఎవరూ ఆఫర్స్ ఇవ్వలేదు. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది.

`నీకు నాకు డాష్‌ డాష్‌`తో 2012లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ముంబయి బొద్దుగుమ్మ నందిత. `ప్రేమ కథా చిత్రమ్‌` సక్సెస్ తో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. `లవర్స్`.. `కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని`.. `రామ్‌లీలా`.. `శంకరాభరణం`, `సావిత్రి`... `విశ్వామిత్ర` వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో ఛాన్స్ లు కూడా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది.

నికిషా పటేల్‌.. పవన్‌ కళ్యాణ్‌ సరసన `పులి` చిత్రం ద్వారా 2010లో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది ఇంగ్లాండ్‌ హాట్‌ బ్యూటీ నికిషా పటేల్‌. తొలి సినిమాతో విపరీతమైన క్రేజ్‌ని పొందింది. `ఓం 3డీ`, `అరకు రోడ్ లో`, `గుంటూరు టాకీస్‌ 2'లో మెరిసింది. కానీ ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. అట్నుంచి తమిళంపై దృష్టి సారించింది. ఇప్పుడు అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా ఉంది.

2013లో మంచు మనోజ్‌ హీరోగా రూపొందిన `పోటుగాడు`తో మెరిసింది డెహ్రాడూన్‌ బొమ్మ సాక్షి చౌదరి. పొడవాటి కాళ్ళతో హాట్‌ అందాలతో ఆకట్టుకుంది. అటుపై `జేమ్స్ బాండ్‌`.. `సెల్ఫీ రాజా`.. `ఆక్సిజన్‌`.. `సువర్ణ` చిత్రాల్లో నటించింది. దాదాపు అన్ని సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఫేడౌట్‌ అయిపోయింది. గతేడాది తమిళంలో `ఇరుట్టు` చిత్రంలో నటించిన సాక్షికి ఇప్పుడు ఒక్క ఛాన్స్ కూడా లేదు. దీంతో ఇటీవలే ఘాటైన అందాలతో రెచ్చిపోతూ ఫీల‌ర్స్ వ‌ద‌లుతోంది. గ్లామర్‌ షో చేస్తూ తనకు అవకాశాలు ఇవ్వండని అడకనే అడుగుతోంది.

హిందీలో బాలనటిగా పలు చిత్రాల్లో మెరి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్‌ 2008లో `కొత్తబంగారు లోకం`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ సందేశ్‌కి జోడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలవడంతోపాటు ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. దీంతో అటు వరుణ్‌ సందేశ్‌.. ఇటు శ్వేతా బసు ప్రసాద్‌ క్రేజీ స్టార్‌ అయ్యారు. తర్వాత `కాస్కో`.. `రైడ్‌`, `కలవార్‌ కింగ్‌`.. `నువ్వెక్కడుంటే నేనక్కడుంటా` చిత్రాల్లో నటించింది. ఆయా సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీంతో శ్వేతా బసుకి ఆటోమెటిక్ గా ఆఫర్స్ తగ్గాయి. దీంతో వ్యభిచారంలోకి దిగిందనే ఆరోపణలు వచ్చాయి. దాన్నుంచి బయటపడి పలు సినిమాలు కూడా చేసింది. హిందీలో వరుసగా రాణించింది. గతేడాది `ది తస్కెంట్‌ ఫైల్స్`లో మెరిసింది. కానీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ కూడా ఆమె చేతుల్లో లేకపోవడం గమనార్హం.

`బస్‌ స్టాప్‌` చిత్రంతో ఒక్కసారి కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది శ్రీదివ్య. `మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు`... `కేరింత` చిత్రాలతో ఆకట్టుకుంది. తెలుగమ్మాయి కావడంతో గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉండిపోయింది. దీంతో ఛాన్స్ లు తగ్గాయి. కానీ ఆమె ప్రతిభని కోలీవుడ్‌ గుర్తించాక‌ తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. `కేరింత` తర్వాత శ్రీదివ్యకి తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. నిజం చెప్పాలంటే ఆమె తమిళ సినిమాలకే ప్రయారిటీ ఇస్తుంది. అందుకే తెలుగులో కనిపించడం లేదు. వీరితోపాటు అనేక మంది భామ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. తెలుగు తెరకు కనుమరుగయ్యారు.