Begin typing your search above and press return to search.

‘జై లవకుశ’లో ఆమె ఎలా కనిపిస్తుందో?

By:  Tupaki Desk   |   17 Sep 2017 9:38 AM GMT
‘జై లవకుశ’లో ఆమె ఎలా కనిపిస్తుందో?
X
గత కొన్నేళ్లలో కేరళ నుంచి వచ్చిన కొంతమంది హీరోయిన్లను టాలీవుడ్ చాలా బాగా ఆదరిస్తోంది. నయనతార.. నిత్యా మీనన్.. అనుపమ పరమేశ్వరన్.. నివేదా థామస్.. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి తెలుగు సినిమాల్లో వెలిగిపోతున్నారు. ఈ నలుగురిలో ఇద్దరి మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ఆ ఇద్దరు.. నిత్యా మీనన్.. నివేదా థామస్. ఇద్దరూ లుక్ పరంగా ఒకేలా ఉంటారు. కొంచెం పొట్టిగా ఉండి.. గ్లామర్ ప్రదర్శన మీద అంతగా ఆసక్తి చూపించరు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓటేస్తారు. నిత్య లాగే నివేదా కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ‘జెంటిల్ మన్’.. ‘నిన్ను కోరి’ సినిమాలు ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

నిత్య లాగే సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న నివేదా.. నిత్య కంటే వేగంగా స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకుంది. ఎన్టీఆర్ మూవీ ‘జై లవకుశ’లో నివేదా ఓ కథానాయికగా నటించింది. మామూలుగా ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో కథానాయిక పాత్రకు ప్రాధాన్యం తక్కువ ఉంటుంది. కేవలం పాటలకే పరిమితం అవుతుంటారు హీరోయిన్లు. నిత్య ఈ ఉద్దేశంతోనే స్టార్ల సినిమాల్లో నటించేది కాదు. ఐతే ఆమె కొంచెం లేటుగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి పెద్ద సినిమాలో నటించింది. అందులో ఆమె పాత్ర తేలిపోయింది. తర్వాత ‘జనతా గ్యారేజ్’ కూడా అంతే. మరి నివేదా.. నిత్యకు భిన్నంగా స్టార్ సినిమాలో మెరుస్తుందేమో చూడాలి. ‘జై లవకుశ’కు ప్రధాన ఆకర్షణ అవుతుందని భావిస్తున్న జై పాత్రకు జోడీగా నివేదా నటిస్తుండటం విశేషం. చాలా టిపికల్ గా సాగుతూ.. క్రూరంగా ప్రవర్తించే ఈ పాత్ర.. ఒక్క అమ్మాయి విషయంలో మాత్రం సాత్వికంగా ప్రవర్తిస్తుందట. ఆ అమ్మాయి పాత్రనే నివేదా చేస్తోంది. కథలో కీలక మలుపుకు ఈ పాత్ర కారణమవుతుందని అంటున్నారు. మరి ఇప్పటిదాకా చేసిన రెండు తెలుగు సినిమాల్లోనూ మెరిసిన నివేదా.. ఎన్టీఆర్ ముందు తన ప్రత్యేకతను ఎలా నిలుపుకుంటుందో చూడాలి.