Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వార్‌: నితిన్ Vs నిఖిల్‌..!

By:  Tupaki Desk   |   21 July 2022 10:47 AM GMT
బాక్సాఫీస్ వార్‌: నితిన్ Vs నిఖిల్‌..!
X
పాండమిక్ తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఫిలిం మేకర్స్ కు చాలా కష్టంగా మారుతోంది. ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. వినోదం కోసం సినిమా హాళ్ల వరకూ రావడం తగ్గించేసారనేది వాస్తవం. విపరీతమైన పబ్లిసిటీ చేసిన మంచి కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలు మాత్రమే ప్రజాదరణ పొందుతున్నాయి. ఎక్కువ శాతం చిత్రాలు కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నాయి.

ఒక కొత్త సినిమా రెండో వారంలో అడుగుపెట్టడం ఈరోజుల్లో చాలా కష్టమైపోయింది. అందుకే బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా సోలో రిలీజ్ చేసుకోవడానికే మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వార్ కు రెడీ అయ్యాయి. 'మాచర్ల నియోజకవర్గం' మరియు 'కార్తికేయ 2' సినిమాలు రెండూ ఆగస్ట్ 12న ఒకేసారి ఢీ కొట్టుకోబోతున్నాయి.

యూత్ స్టార్ నితిన్ హీరోగా ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ''మాచర్ల నియోజకవర్గం''. ఇదొక పొలిటిక‌ల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. కృతి శెట్టి - కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటించగా.. అంజలి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.

'మాచర్ల నియోజకవర్గం' సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికితా రెడ్డి నిర్మించారు. అప్పుడెప్పుడో పూర్తైన ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ వీక్ లో రిలీజ్ చేయాలని ముందు నుంచీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. 'ఏజెంట్' 'యశోద' వంటి చిత్రాలు వచ్చే అవకాశం లేకపోవడంతో.. చాలా రోజుల క్రితమే ఆగస్ట్ 12 మీద కర్చీఫ్ వేసుకుని కూర్చున్నాడు నితిన్. దీనికి తగ్గట్టుగానే నెలన్నర ముందే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

అయితే ఇప్పుడు సడన్ గా అదే రోజున యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన ''కార్తికేయ 2'' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది చందు మొండేటి దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇది బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ 'కార్తికేయ 2' చిత్రాన్ని నిర్మించారు. దీని కోసం భారీ బడ్జెట్ పెట్టారు. అందుకే సోలో రిలీజ్ డేట్ కోసం వేచి చూసి జులై 22న రావాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే అదే రోజు నాగచైతన్య 'థాంక్యూ' మూవీ రిలీజ్ ఉండటంతో నిఖిల్ సినిమాను వాయిదా వేశారు. దీంతో ఆగస్ట్ 12కి షిఫ్ట్ కావాల్సి వచ్చింది.

దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్ వెర్సన్ నిఖిల్ మధ్య వార్ అనివార్యం అయింది. ఈ రెండు సినిమాలు ఇద్దరికీ కీలకమనే చెప్పాలి. 'చెక్' 'రంగ్ దే' 'మ్యాస్ట్రో' వంటి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని నితిన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులోనూ ఇది చాలా గ్యాప్ తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.

మరోవైపు నిఖిల్ తన గత చిత్రం 'అర్జున్ సురవరం' తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇదే జోష్ ని కొనసాగించాలని ప్లాన్ చేసుకోగా కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. దీంతో మరో సినిమా రావడానికి చాలా టైం పట్టింది. అందుకే ఇప్పుడు 'కార్తికేయ 2' చిత్రంతో హిట్టు కొట్టి నెక్స్ట్ లెవల్ కు చేరిపోవాలని నిఖిల్ ప్లాన్ చేసుకున్నాడు. ఇది తన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

ఇలా నిఖిల్ మరియు నితిన్ లకు ఈ రెండు సినిమాకు హిట్ అవడం ఎంతో అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో సోలో రిలీజ్ ఉంటే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒకరి సినిమాతో మరొకరు పోటీ పడాల్సి వచ్చింది. మరి బాక్సాఫీస్ వార్ లో 'మాచర్ల నియోజకవర్గం' మరియు 'కార్తికేయ 2' చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.