Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: వుడ్ సైడ్ విల్లా మరోసారి వార్తలోకి!

By:  Tupaki Desk   |   6 March 2020 7:39 AM GMT
ట్రైలర్ టాక్: వుడ్ సైడ్ విల్లా మరోసారి వార్తలోకి!
X
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ 'నిశ్శబ్దం'. మాధవన్.. అంజలి.. శాలిని పాండే.. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సెన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 2 న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

ట్రైలర్ ఆరంభంలో ఒక అమెరికన్ న్యూస్ రిపోర్టర్ "దెయ్యాల కొంప అనే పేరున్న వుడ్ సైడ్ విల్లా ఈరోజు మరోసారి వార్తల్లోకి వచ్చింది" అన చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో "అక్కడ చీకట్లో ఎవరో ఎటాక్ చేశారంట. కానీ ఎవరో ఏంటో కనిపించలేదు అంటున్నారు" అంటూ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఆఫీసర్ అంజలికి చెప్తారు. అంజలి ఈ కేసును విచారణ చేస్తూ ఉంటుంది. "ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు" అని మరో సీన్ లో అంజలి చెప్తుంది. అనుష్క ను విచారిస్తూ "నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి(శాలిని) ఎందుకు రాలేదు?" అని ప్రశ్నిస్తుంది. "నిన్న ఆర్ఫనేజ్ కు వెళ్ళిన మాకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి" అంటుంది. అవసరాల శ్రీనివాస్ మరో సీన్ లో "ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?" అని అడిగితే "ఎవరో తనకి సహాయం చేస్తున్నారు" అంటూ బదులిస్తుంది.

ఇదంతా ఒక లైన్ లో చెప్పుకుంటే.. ఓ దెయ్యాల కొంప అని పేరుపడిన విల్లా. అక్కడ అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడ అనుష్కకు ఏం జరిగింది..ఎలాంటి ఇబ్బంది వచ్చింది? నిజంగానే అది దెయ్యాల పనేనా లేక వాటి పేరుతో ఎవరైనా మనుషులు చేస్తున్నారా అనేది విచారణలో పోలీస్ ఆఫీసర్ అంజలి తెలుసుకోవాలి. ఓ థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ట్రైలర్ లో ఉన్నాయి. అందరూ మంచి నటీనటులు కావడంతో ఎఫెక్టివ్ గా ఉంది. అమెరికా నేపథ్యం.. రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ చక్కగా కుదిరాయి. మరి ఆలస్యం ఎందుకు నిశ్శబ్దం గా 'నిశ్శబ్దం' ట్రైలర్ చూసేయండి.. లేకపోతే అంజలి వచ్చి ఎందుకు.. ఏమిటి.. ఎలా.. ఎక్కడ అంటూ విచారణ చేపట్టేలా ఉంది.