Begin typing your search above and press return to search.

'సవ్యసాచి' భామది మామూలు సుడి కాదు

By:  Tupaki Desk   |   5 Nov 2018 3:17 PM GMT
సవ్యసాచి భామది మామూలు సుడి కాదు
X
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముంబయి భామ నిధి అగర్వాల్. హిందీలో తొలి అడుగులు వేస్తుండగానే నిధికి తెలుగులో ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. విశేషం ఏంటంటే ఈ చిత్రం విడుదల కాకముందే.. నాగచైతన్య తమ్ముడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’లో అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు ‘సవ్యసాచి’ విడుదలైన కొన్ని రోజులకే ఆమె ఇంకో అవకాశం పట్టేసింది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం కానున్న కొత్త సినిమాలో నిధినే హీరోయిన్ గా ఎంపిక చేశారట. ‘సవ్యసాచి’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఆ సినిమాను కూడా నిర్మించనుంది. అందులో సుకుమార్ సైతం నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సవ్యసాచి’ ఆశించిన టాక్ తెచ్చుకోలేదు. ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది. ఈ చిత్రంలో నిధి గ్లామర్ పరంగా ఆకట్టుకుంది కానీ.. నటన విషయంలో అంత మంచి ఫీడ్ బ్యాక్ ఏమీ రాలేదు. ఆమెకు సినిమాలో చెప్పుకోదగ్గ రోల్ కూడా ఏమీ లేదు. అయినా ఇదేమీ పట్టించుకోకుండా మైత్రీ సంస్థ తమ బేనర్లోనే నిధికి ఇంకో ఛాన్స్ ఇవ్వడం విశేషమే. మొత్తానికి నిధిది మామూలు సుడి కాదనే విషయంలో మరోసారి రుజువైంది. ఈ సినిమా కోసం వైష్ణవ్ కొన్ని నెలలుగా సన్నద్ధం అవుతున్నాడు. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ తరహాలోనే ఇది కూడా వైవిధ్యమైన సినిమా అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.