Begin typing your search above and press return to search.

కంచె దాటుతున్న అభిమానం..ఎవ‌రికి చేటు?

By:  Tupaki Desk   |   3 May 2022 4:30 AM GMT
కంచె దాటుతున్న అభిమానం..ఎవ‌రికి చేటు?
X
అభిమానం విమ‌ర్శ‌ల వెర్రితో కంచె దాటుతోందా? ఫ్యాన్స్ స్టార్స్ పాలిట విల‌న్స్ గా మారుతున్నారా?.. జేజేలు కొట్టిన స్టార్స్ నే ఇప్పుడు కించ‌ప‌రుస్తున్నారా? అంటే ఇటీవ‌ల జ‌రిగిన ఉదంతాల‌ను బ‌ట్టి చూస్తే నిజ‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. స్టార్ ల‌కు అండ‌గా నిల‌వాల్సిన ఫ్యాన్సే వారిని ఇప్ప‌డు ఇరుకున పెడుతున్నారు. మెగా ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్, మ‌హేష్ ఫ్యాన్స్‌, మంచు ఫ్యాన్స్.. సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్, ప్ర‌భాస్ ఫ్యాన్స్ ..ఇలా అంద‌రి హీరోల అభిమానులు న‌చ్చితే ఒక‌లా న‌చ్చ‌క‌పోతే మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తూ స్టార్ హీరోల‌కు ఇబ్బందిక‌రంగా మారుతున్నారు. వీరికి తోడు యాంటీ ఫ్యాన్స్ ర‌చ్చ మ‌రింత ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది.

న‌చ్చ‌ని హీరో సినిమా బాగున్నా లేక‌పోయినా లోపాలు వెత‌క‌డం.. ట్రోల్ కు గురిచేయ‌డం ఇప్పుడు న‌యా ట్రెండ్‌ గా మారింది. సోష‌ల్ మీడియా కార‌ణంగా అది కాస్తా ఇటీవ‌ల ప‌రాకాష్ట‌కు చేరింది. ప్ర‌భాస్ 'రాధేశ్యామ్‌' నుంచి నేటి 'ఆచార్య‌' వ‌ర‌కు ట్రోల‌ర్స్, యాంటీ ఫ్యాన్స్‌.. చివ‌రికి ఫ్యాన్స్ కూడా స్టార్స్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌భాస్ న‌టించిన 'రాధేశ్యామ్‌' రిలీజ్ అప్ డేట్ తో పాటు ప‌లు విష‌యాల్లో ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ ని, ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయ‌డం తెలిసిందే.

త‌మ హీరో సినిమా ల‌ప్ డేట్ ఇవ్వ‌ట్లేదంటూ ట్రోల్ చేసిన అభిమానులు 'రాధేశ్యామ్‌' త‌రువాత కూడా సినిమా ఫ‌లితంపై ఎదురుదాడి చేశారు. మ‌రీ ముఖ్యంగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ పై విమ‌ర్శ‌లు చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇలా ప్ర‌భాస్ అభిమానులు కూడా స‌హ‌నం కోల్పోయి హ‌ద్దులు దాటి నానా ర‌చ్చ‌కు తెర‌తీయ‌డం తెలిసిందే. ఇక వీరి త‌రువాత సోష‌ల్ మీడియాలో మ‌రింత ర‌చ్చ‌కు తెర‌లేపిన ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్‌.

'ట్రిపుల్ ఆర్' రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూసిన ఈ అభిమానులు రిలీజ్ త‌రువాత ఒక‌రిపై ఒక‌రు బుర‌ద‌జ‌ల్లుకోవ‌డం మొద‌లు పెట్టారు. అంతే కాకుండా సినిమాలో మా హీరో పాత్ర ప‌వ‌ర్ ఫుల్ అంటే అఏదు మా హీరో పాత్ర ప‌వ‌ర్ ఫుల్ అంటూ నానా హంగామా చేశారు. ఇక కొంత మంది అభిమానుల మ‌రీ ఓ అడుగు ముందుకేసి సినిమాలో మా హీరోని తొక్కేశార‌ని ఎన్టీఆర్ అభిమానులు విమ‌ర్శ‌లు చేస్తే చ‌ర‌ణ్ ఫ్యాన్స్ మా హీరోకు ఎక్కువ ప్రాధాన్య‌త ల‌భించింద‌ని గొప్ప‌లు పోయారు.

ఫైన‌ల్ గి ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ క‌లిసి త‌మ హీరోల‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదంటూ ఏకంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళినే టార్గెట్ చేయ‌డం తెలిసిందే. ఇక బ‌న్నీ - మ‌హేష్ సినిమాలు ఎప్పుడు పోటీప‌డినా ఈ ఇద్ద‌రు హీరోలు ఫ్యాన్స్ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. త‌మ హీరో సినిమా బాక్సాఫీస్ స‌మ‌రంలో గెల‌వాల‌ని మ‌హేష్ సినిమాపై నెగెటివ్ ప్ర‌చారం చేసిన సంద‌ర్భాలు కూడా వున్నాయి. 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రం స‌మ‌యంలో మ‌హేష్ న‌టించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' విడుద‌లైంది. ఈ సినిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా తొక్కేయాల‌ని బ‌న్నీ ఫ్యాన్స్ చేయ‌ని ర‌చ్చ లేదు.

ఇటీవ‌ల మంచు మోహ‌న్ బాబు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింద‌ని తెలియ‌గానే యాంటీ ఫ్యాన్స్ , మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశారు. ఇది మంచు ఫ్యాన్స్ ని తీవ్రంగా క‌ల‌చివేసింది. తాజాగా మెగాస్టార్ న‌టించిన 'ఆచార్య‌' చిత్రానికి ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఏప్రిల్ 29న 'ఆచార్య' థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో మోగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఫ్యాన్స్ కూడా భారీగానే ఎక్స్ పెక్ట్ చేశారు. చిరు నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

దీంతో యాంటీ ఫ్యాన్స్ ఉద‌యం నుంచే సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయారు. సినిమాలోని కీల‌క సీన్ ల‌కు సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇదే అద‌నుగా నంద‌మూరి ఫ్యాన్స్ , మంచు ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి ఫ్లాప్ అంటూ ఎంజాయ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇలా ఒక హీరో సినిమా ఫ్లాప్ ని మ‌రో హీరో ఫ్యాన్స్ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం.. ట్రెండుగా మారిపోయింది. దీంతో ఫ్యాన్స్ కార‌ణంగా హీరోలు ఇప్ప‌డు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ట్రోలింగ్ ద్వారా మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఇలాంటి విష సంస్కృతిని ఫ్యాన్స్ వీడితేనే మంచి సినిమాలొస్తాయి. ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌ని విమర్శ‌కులు ఘాటుగా ఫ్యాన్స్ వార్ పై స్పందిస్తున్నారు.