Begin typing your search above and press return to search.

తారక్ పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవుగా..!

By:  Tupaki Desk   |   11 April 2022 5:58 AM GMT
తారక్ పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవుగా..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు RRR సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న తారక్.. పాన్ ఇండియా క్రేజ్ ను కాపాడుకునేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా దర్శకుడు కొరటాల శివతో ఉంటుందని ప్రకటించారు. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత వీరి కాంబోలో రానున్న #NTR30 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల మూవీ షూట్‌ ను వీలైనంత త్వరగా ముగించాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇదే క్రమంలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తో చేతులు కలపాలని తారక్ ఆత్రంగా ఉన్నారు. 'కేజీఎఫ్: చాప్టర్-1' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్.. ‘కేజీఎఫ్-2’ సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న 'సలార్' సినిమా సెట్స్ మీద ఉంది. పెండింగ్ షూట్‌ ను కంప్లీట్ చేసి NTR31 ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నారు.

ఎన్టీఆర్ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళుతుందని ప్రశాంత్ నీల్ ఇటీవల స్పష్టత ఇచ్చారు. తాను చెప్పిన కథ తారక్ కు నచ్చిందని.. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని దర్శకుడు తెలిపారు. స్క్రిఫ్ట్ వర్క్ ప్రారంభించడానికి ముందే దాదాపుగా 10-15సార్లు తారక్‌ ను కలిశానని.. ఆయనతో ప్రయాణం అద్భుతంగా ఉందని ప్రశాంత్ పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని రూపొందించనున్నారు.

మరోవైపు కొరటాల మూవీ షూటింగ్ జూన్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టూడెంట్ పాలిటిక్స్‌ పై స్టోరీ లైన్‌ ఉంటుందని అంతర్గతంగా చెబుతున్నారు. అయితే ఇదొక రివేంజ్ డ్రామా అని తారక్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజం.. RRR తర్వాత ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో స్టోరీని యూనివర్సల్ కథగా చేయమని కొరటాల మీద ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం అవుతోందని అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ తన నెక్ట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

NTR30 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇందులో తారక్ కు జోడీగా అలియా భట్ ని.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.