Begin typing your search above and press return to search.

అందాల రాక్షసికి ఓ మంచి ఆఫర్‌

By:  Tupaki Desk   |   30 Nov 2021 7:07 AM GMT
అందాల రాక్షసికి ఓ మంచి ఆఫర్‌
X
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. కాని కమర్షియల్‌ గా ఈ అమ్మడు బిగ్గెస్ట్‌ సక్సెస్ లను దక్కించుకోలేక పోవడంతో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగు లో ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్‌ కిషన్ హీరోగా నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ మరియు కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమాలను చేసిన లావణ్య త్రిపాఠికి టైమ్‌ కలిసి రాలేదు. రెండు సినిమాలు కరోనా సమయంలో వచ్చి పెద్దగా కనిపించకుండానే పోయాయి.

చావు కబురు చల్లగా సినిమా నిరాశ పర్చినా కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. డీ గ్లామర్ గా ఆ సినిమాలో కనిపించి నటిగా నిరూపించుకుంది. అందుకే ఈ అమ్మడికి ఒక క్రైమ్ కామెడీ సినిమా చేతికి వచ్చిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠి ఆ సినిమాలో లీడ్ రోల్‌ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మత్తు వదలరా సినిమాను చేసిన దర్శకుడు రితేష్‌ రానా ఈ క్రైమ్‌ కామెడీకి దర్శకత్వం వహించబోతున్నాడు. విభిన్నమైన సినిమాల దర్శకుడిగా మొదటి సినిమాతోనే నిరూపించుకున్న దర్శకుడు రీతేష్ రానా ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ లో బిజీగా ఉన్నాడట. ఈ సినిమా విభిన్నమైన కామెడీని ప్రేక్షకులు అందించే విధంగా స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నట్లుగా మీడియా వర్గాల వారికి రితేష్ లీక్ ఇచ్చాడట.

ఇంకా టైటిల్‌ నిర్థారణ అవ్వని ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చకచక జరుగుతున్నాయట. అందులో భాగంగా పాత్ర కోసం లావణ్య త్రిపాఠి వర్క్ షాప్ లో పాల్గొంటుందట. కామెడీ టైమింగ్‌ మరియు నటన విషయంలో లావణ్య సీనియర్ ల వద్ద ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అందాల రాక్షసి ఒక మంచి ఆఫర్‌ ను అయితే దక్కించుకుంది. కెరీర్‌ ఆరంభం అయ్యి పుష్కర కాలం కావస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడు ముందు ముందు అయినా బిజీ అయ్యేనా అనేది అనుమానంగా మారింది. ఈ క్రైమ్‌ కామెడీ సినిమా అయినా కమర్షియల్‌ గా ఆమెకు బ్రేక్ ను ఇస్తే కొంత కాలం అయినా లావణ్య త్రిపాఠి బిజీ బిజీగా సినిమాలు చేసుకుంటు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.