Begin typing your search above and press return to search.

క‌రోనా క‌లిపింది ఇద్ద‌రినీః మేం విడాకులు తీసుకోవ‌ట్లేదు.. హీరో దంప‌తులు

By:  Tupaki Desk   |   9 March 2021 2:30 PM GMT
క‌రోనా క‌లిపింది ఇద్ద‌రినీః మేం విడాకులు తీసుకోవ‌ట్లేదు.. హీరో దంప‌తులు
X
ఒంట‌రి త‌నం చాలా నేర్పిస్తుంది.. బ‌ల‌మైన‌ నిర్ణ‌యాల‌ను కూడా స‌మీక్షించుకునే అవ‌కాశం ఇస్తుంది. జీవితాన్ని ప్ర‌భావితం చేసే నిర్ణ‌యాల‌ను కూడా మార్చేస్తుంది. ఇప్పుడు ఓ సెల‌బ్రిటీ జంట విష‌యంలో అదే జ‌రిగింది. బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ, ఆయ‌న భార్య అలియా ఏడాది క్రితం విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. తాజాగా ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నామని ప్రకటించడం విశేషం.

వీరిద్దరూ వివాహం చేసుకుని పదేళ్లు గడిచాయి. అయితే.. ఈ కాలంలో తాను ఎన్నో విధాలుగా వేధింపుల‌కు గుర‌య్యాన‌ని, అందుకే తాను విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు అలియా. ఈ మేర‌కు గత మేలో భర్త నవాజుద్దీన్ కు నోటీసులు కూడా పంపించారు.

అయితే.. ఆ త‌ర్వాత క‌రోనా విజృంభించ‌డంతో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించాయి. ఈ గ్యాప్ లో భార్యాభ‌ర్త‌లు ఒంటరిగా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ సాగిన జీవితాన్ని.. భ‌విష్య‌త్ లో ఒంట‌రిగా సాగాల్సిన జీవితాన్ని స‌మీక్షించుకున్నారు. అంచ‌నా వేసుకున్నారు. ఫైన‌ల్ గా వివాహ ర‌ద్దు నిర్ణ‌యాన్నే ర‌ద్దు చేసుకున్నారు.

ఈ విష‌య‌మై అలియా మాట్లాడుతూ.. త‌న పిల్ల‌ల‌కు ఖ‌చ్చితంగా తండ్రి తోడు అవ‌స‌ర‌మ‌ని గుర్తించిన‌ట్లు చెప్పింది. తాను కొవిడ్ బారిన ప‌డ్డ స‌మ‌యంలో భ‌ర్త ఎంతో సేవ చేశాడ‌ని, పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకున్నాడ‌ని తెలిపింది. పిల్ల‌ల‌కు తండ్రి అవ‌స‌రం ఉంద‌ని, వారికి తామిద్ద‌రం క‌లిసి ఉండ‌డం అవ‌స‌రమ‌ని గుర్తించిన‌ట్లు చెప్పింది. అందుకే విడాకుల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్టు తెలిపింది అలియా.

ఇక‌, న‌వాజుద్దీన్ కూడా ఇదే విధంగా స్పందించాడు. త‌మ‌ మ‌ధ్య ఉన్న విభేదాల వ‌ల్ల పిల్ల‌లు ఇబ్బంది ప‌డొద్ద‌ని, త‌న మొద‌టి ప్రాధాన్య‌త పిల్ల‌ల భవిష్య‌త్తేన‌ని చెప్పాడు. మొత్తానికి క‌రోనా కాలం విడిపోవాల‌నుకున్న భార్యాభ‌ర్త‌ల‌ను క‌లిపింద‌ని చెప్పుకోవ‌చ్చు.