Begin typing your search above and press return to search.

జాతీయ భాష వివాదం: సరికొత్త డిమాండ్ తో వచ్చిన ఫైర్ బ్రాండ్..!

By:  Tupaki Desk   |   30 April 2022 7:30 AM GMT
జాతీయ భాష వివాదం: సరికొత్త డిమాండ్ తో వచ్చిన ఫైర్ బ్రాండ్..!
X
సౌత్ సినిమాలు నార్త్ బెల్ట్ లో వద్ద రికార్డుల మోత మోగిస్తున్న నేపథ్యంలో.. దక్షిణాది ఉత్తరాది నటీనటుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ ఓ కార్యక్రమంలో ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండదని పేర్కొనడంతో.. అది కాస్తా బాషా వివాదంగా టర్న్ తీసుకుంది.

సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్పందిస్తూ.. హిందీ ఎప్పటి నుంచో జాతీయ భాషగా ఉందని.. ఎప్పటికీ అలానే ఉంటుందని అన్నారు. దీనికి సుదీప్ కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ట్వీట్ వార్ గా మారింది. ఈ వ్యవహారం పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో లాంగ్వేజ్ వార్ పై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. 'ధాకడ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన కంగనా.. హిందీ కంటే కూడా సంస్కృతం మన జాతీయ భాషగా ఉంటే బాగుంటుందని సరికొత్త వాదన తెర పైకి తీసుకొచ్చింది.

''హిందీ కంటే సంస్కృతం మన జాతీయ భాషగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే తెలుగు, కన్నడ, తమిళం, గుజరాతీ, హిందీ కంటే కూడా సంస్కృతం భాష చాలా పురాతనమైనది. పైగా భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చాయి. సంస్కృతం మన దేవభాష'' అని కంగనా పేర్కొంది.

''దేవభాష సంస్కృతం కంటే గొప్పది భాష వేరేది లేదు. నన్ను అడిగితే సంస్కృతం జాతీయ భాషగా ఉంటే మంచిది'' అని కంగనా అభిప్రాయ పడింది. ఇప్పటికే హిందీ జాతీయ భాష అవును - కాదు అంటూ సౌత్ - నార్త్ నెటిజన్లు నెట్టింట ఫైట్ చేస్తున్నారు.

ఇప్పుడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ లాంగ్వేజ్ ఇష్యూపై స్పందించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదంలోకి ఎంటర్ అయిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. సంసృతం జాతీయ భాషగా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేసింది. మరి కంగనా కామెంట్స్ పై ఎవరెలా స్పందిస్తారో చూడాలి.

ఇకపోతే భాష ప్రాధాన్యత గురించిసుదీప్ - అజయ్ దేవగన్ మధ్య చెలరేగిన వివాదంలోకి కర్ణాటక రాజకీయ నాయకులు కూడా కలుగజేసుకున్నారు. సుదీప్ ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదని విపక్షనేత సిద్ధ రామయ్య అన్నారు.

దేశంలో ఉన్న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ భాషల మాదిరిగా హిందీ కూడా ఒక భాష అని మాజీ సీఎం కుమారస్వామి అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు దక్షిణాది లేదా ఉత్తరాది అనేవి లేవు.. భారతదేశం మొత్తం ఒక్కటేనని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే భారత రాజ్యాంగం హిందీ అధికారిక భాషగా ఉంటుందని మాత్రమే పేర్కొందని.. ఏ భాషనూ జాతీయ భాషగా ఎంపిక చేయలేదని రాజకీయవేత్తలు అంటున్నారు. ఇలా విభజించుకోవడం మానేసి.. ఒకరి భాషలను మరొకరు గౌరవించుకుంటూ.. మనందరం భారతీయులమనే విషయాన్ని గుర్తు చేసుకొని స్నేహ భావంతో మెలగాలని సూచిస్తున్నారు.