Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి-మంచు లక్ష్మి కలిస్తే...

By:  Tupaki Desk   |   31 March 2016 7:47 AM GMT
బ్రాహ్మణి-మంచు లక్ష్మి కలిస్తే...
X
నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులెవ్వరూ ఎప్పుడూ పెద్దగా లైమ్ లైట్ లో ఉండరు. వాళ్లు మీడియాలో కానీ.. టీవీలో కానీ కనిపించడం చాలా చాలా అరుదు. ముఖ్యంగా బాలయ్య పిల్లల వాయిస్ ఎలా ఉంటుందన్నది కూడా జనాలకు అవగాహన లేదు. వాళ్లను ప్రచారానికి అంత దూరంగా ఉంచుతాడు బాలయ్య. ఐతే తొలిసారి నారా బ్రాహ్మణి ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐతే అది చాలా మంచి కార్యక్రమం కావడం.. పైగా బాలయ్య ఫ్యామిలీకి సన్నిహితురాలైన మంచు లక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో బ్రాహ్మణి ఆ షోలో పాల్గొంది. ఆ ప్రోగ్రామే.. ‘మేము సైతం’. సామాజిక స్పృహతో ముడిపడిన ఈ కార్యక్రమానికి బ్రాహ్మణి అతిథిగా వచ్చింది.

ఈ షోకు ఆమె ఎందుకొచ్చింది.. ఏం మాట్లాడింది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది కానీ.. ఈ లోపు షోలో లక్ష్మితో కలిసి కూర్చుని మైకు పట్టుకుని మాట్లాడుతున్న దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదే ఎపిసోడ్ లో రానా దగ్గుబాటి కూడా పాల్గొనడం విశేషం. బ్రాహ్మణి తొలిసారి ఓ టీవీ షోలో కనిపించబోతుండటంతో ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దామని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెలబ్రెటీల్ని సమాజానికి దగ్గర చేస్తూ.. వారి ద్వారా సొసైటీకి మంచి చేసే ఉద్దేశంతో లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేముసైతం’ ఏప్రిల్ 2 నుంచి జెమిని టీవీలో ప్రసారం కాబోతోంది. శనివారం రాత్రి 9 గంటలకు తొలి ఎపిసోడ్ చూడొచ్చు. ఈ కార్యక్రమం కోసం మోహన్ బాబు.. అఖిల్ అక్కినేని.. రకుల్ ప్రీత్ సింగ్.. రెజీనా కసాండ్రా తదితరులు తమ వంతు సహకారం అందించారు.