Begin typing your search above and press return to search.

నా పిల్ల‌ల ఆనంద‌మే నాకు ముఖ్యం: నాగ్‌

By:  Tupaki Desk   |   8 Nov 2017 4:50 PM GMT
నా పిల్ల‌ల ఆనంద‌మే నాకు ముఖ్యం: నాగ్‌
X
విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ- యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునల‌ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన శివ త‌ర‌హాలో మ‌రో యాక్ష‌న్ మూవీని ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఈ నెల 20న‌ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి, సమంత గురించి నాగార్జున అనేక విష‌యాలు వెల్ల‌డించారు. వ‌ర్మ చెప్పిన క‌థ బాగా న‌చ్చ‌డంతో ఆ సినిమాకు ఓకే చెప్పాన‌ని నాగ్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు. ఓ స‌రికొత్త యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఆ సినిమా ఉండ‌బోతోందన్నారు.

30 ఏళ్లుగా తాను నటిస్తూనే ఉన్నానని, కెరీర్ లో కొన్ని చిత్రాలు అసంతృప్తినిచ్చాయ‌ని చెప్పారు. అయితే, అలాంటివి లేకుంటే జీవితం కొంచెం బోరింగ్ గా ఉంటుందని నాగ్ అన్నారు. స‌మంత , నాగచైతన్యల‌ వివాహం తర్వాత పెద్ద మార్పులేమీ జరగలేద‌ని, పెళ్లికి ముందు నుంచి సామ్‌ మా కుటుంబంలో సభ్యురాల‌ని నాగ్‌ అన్నారు. పెళ్లి కాకముందు తనను ‘నాగ్ సార్’ అని పిలిచేదని, పెళ్లయిన తర్వాత ‘మామ’ అంటోందని నాగ్ చ‌మ‌త్క‌రించారు. తన పిల్లల ఆనందమే త‌న‌కు ముఖ్య‌మ‌ని, త‌న‌కింకేమీ అక్కరలేదని అన్నారు. చైతూ, అఖిల్ లు నాగార్జున కుమారులు అనే ట్యాగ్ నుంచి బయటపడి, వారి కాళ్లపై నిలబడేందుకు చాలా కష్టపడుతున్నారన్నారు. సినిమాల పరంగా త‌మ ముగ్గురికీ ఎప్పుడూ పోటీ ఉంటుంద‌న్నారు. సినిమాల విష‌యంలో తండ్రీకొడుకుల మ‌ధ్య‌ స‌వాల్ ఉంటుంద‌న్నారు.