Begin typing your search above and press return to search.

నాగార్జున ఖండించిన రెండు విషయాలు

By:  Tupaki Desk   |   16 Jan 2016 7:08 AM GMT
నాగార్జున ఖండించిన రెండు విషయాలు
X
ఓ పక్క తన కెరీర్ చూసుకుంటూ.. ఇంకో పక్క తన కొడుకుల కెరీర్లను చక్కదిద్దే పనిలో ఉంటూ తీరిక లేకుండా గడిపేస్తున్నాడు నాగ్. ఈ తరం హీరోలతో పోటీ పడుతూ తన కెరీర్ నిలబెట్టుకోవడమే సవాల్ అంటే.. కొడుకుల సంగతి కూడా పట్టించుకోవడం అంటే ఆయనకు ఇబ్బందే. అయినప్పటికీ రెండు పనుల్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతున్నారు. ‘అఖిల్’ అరంగేట్రం సాఫీగా సాగిపోయి ఉంటే ఇబ్బంది లేకపోయేది కానీ.. ఆ సినిమా బోల్తా కొట్టడం నాగ్‌ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. మరోవైపు పెద్ద కొడుకు చైతూ కెరీర్ కూడా అప్ అండ్ డౌన్స్ తో సాగుతోంది. ఈ నేపథ్యంలో తాను, తన కొడుకులు చేయాల్సిన తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు నాగ్.

ఈ నేపథ్యంలో ‘మనం’ తరహాలో నాగ్ తన కొడుకులతో కలిసి ఓ మూవీ చేస్తాడని.. మరోవైపు అఖిల్ రెండో సినిమా బాలీవుడ్ రీమేక్ అని వార్తలు వినిపించాయి ఈ మధ్య. ఐతే నాగ్ ఈ విషయాలు రెండూ ఖండించాడు. ‘‘మనం తరహా సినిమా చేస్తున్నామన్నది అబద్ధం. అలాంటి మంచి కథ వస్తే వదిలిపెట్టను. కానీ అలాంటిది దొరకడం అంత సులువు కాదు. నన్ను, చైతూను దృష్టిలో ఉంచుకుని గతంలో చాలా కథలు రాసి పట్టుకొచ్చారు. కానీ ‘మనం’ మాత్రమే నచ్చి అది చేశాం. మళ్లీ అలాంటి కథ ఎప్పుడొస్తుందో చెప్పలేం. ఇక అఖిల్ రెండో సినిమా విషయంలోనూ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అఖిల్ ది చిన్న వయసే కదా. త్వరలోనే సీసీఎల్ వస్తోంది. చక్కగా క్రికెట్ ఆడుకుని వచ్చేయ్ అని చెప్పా. అంతలోపు నా పనులూ పూర్తవుతాయి. తర్వాత ఇద్దరం కూర్చుని కొత్త సినిమా గురించి ఆలోచించాలి’’ అని నాగ్ చెప్పాడు.