Begin typing your search above and press return to search.

నాగ్ అక్క అతడిపై కేసు పెట్టింది

By:  Tupaki Desk   |   18 Nov 2017 10:25 AM GMT
నాగ్ అక్క అతడిపై కేసు పెట్టింది
X
అక్కినేని నాగార్జున అక్క నాగసుశీల్.. తన వ్యాపార.. సినీ నిర్మాణ భాగస్వామి చింతలపూడి శ్రీనివాసరావుపై కేసు పెట్టిన విషయంలో కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ భూవివాదానికి సంబంధించి శ్రీనివాసరావుపై ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తనతో వ్యాపార భాగస్వామిగా ఉన్న చింతలపూడి శ్రీనివాస్‌ తనకు తెలియకుండా శంకర్‌పల్లిలో ఉన్న భూమిని విక్రయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో పాటు తమ కంపెనీ ఎస్‌ ఎస్‌ ప్రాపర్టీలోని డబ్బుల్ని శ్రీనివాసరావు దుర్వినియోగం చేశాడని.. తనకు తెలియకుండా ఎస్‌ఎస్‌ ప్రెమిసెస్‌ పేరిట మరో కంపెనీని ప్రారంభించి మోసం చేశాడని నాగ సుశీల వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చింతలపూడి శ్రీనివాసరావు.. నాగసుశీలతో కలిసి ఆమె తనయుడు సుశాంత్ హీరోగా నాలుగు సినిమాలు నిర్మించాడు. తొలి సినిమా ‘కాళిదాసు’ ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ తర్వాత కూడా వరుసగా సుశాంత్ తోనే సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ‘కరెంట్’.. ‘అడ్డా’.. ‘ఆటాడుకుందాం రా’ సినిమాలకు కూడా అతను నిర్మాణ భాగస్వామే.

ఈ సినిమాల నిర్మాణ సమయంలో శ్రీనివాసరావు సుశాంత్ కుటుంబానికి చాలా సన్నిహితంగా కనిపించాడు. వీరితో ఎలాంటి ఇబ్బంది లేనట్లు ఉన్నాడు. ఐతే ఓ బయటి వ్యక్తి వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నా.. బాగా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుండటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కట్ చేస్తే ఇప్పుడు అతడిపై నాగ్ అక్క కేసు పెట్టింది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో.. ఇందులో శ్రీనివాసరావు వెర్షన్ ఏంటో చూడాలి మరి.