Begin typing your search above and press return to search.

రోహిత్ కనెక్ట్ అయ్యాడు.. చేశాను అంతే!

By:  Tupaki Desk   |   29 Aug 2018 4:57 AM GMT
రోహిత్ కనెక్ట్ అయ్యాడు.. చేశాను అంతే!
X
ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్స్ రెండు ఉన్నాయి. ఒకటి బయోపిక్కు.. రెండు మల్టిస్టారరు! ఇక బయోపిక్కులకు అసలు లెక్కలేకుండా పోతోంది. కొన్ని రోజులు పోతే 'గూడ్స్ గార్డ్ దీన గాధ'.. 'ఆయమ్మ ఆత్మకథ' లాంటి సినిమాలు కూడా వస్తాయేమో. మరోవైపు మల్టిస్టారర్ ట్రెండ్ కూడా జోరుగా ఉంది. ఒకవైపు పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ మల్టి స్టారర్ సినిమాలు వస్తుంటే.. మరో వైపు 'సిల్లీ ఫెలోస్' లాంటి సింపుల్ మల్టిస్టారర్స్ కూడా తెరకెక్కుతున్నాయి. గతంలో హీరోలు మల్టిస్టారర్లు చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అయినా నేను మాత్రం మల్టిస్టారర్స్ చెయ్యను అంటున్నాడు నాగశౌర్య.

నాగశౌర్య తాజా చిత్రం '@నర్తనశాల' రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు నాగశౌర్య. ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో "మీరు మల్టిస్టారర్ సినిమాలు చేస్తారా?" అని అడిగితే "నాకు మొదటి నుంచి మల్టీస్టారర్లపై పెద్దగా ఆసక్తి లేదు. ఎప్పుడో ఓసారి నారా రోహిత్ తో చేశాను. ఇక అంతే. భవిష్యత్తులో ఇక ఎవరితో చేయను కూడా. నాకు రోహిత్ బాగా తెలుసు. బాగా కనెక్ట్ అయ్యాడు కాబట్టి చేశాను. ఇక ఎవరితో చేయనంతే" అంటూ మట్టి కుండ బద్దలు కొట్టాడు.

వేరే హీరో కనుక రోహిత్ లా తనకు కనెక్ట్ అయితే అతడితో మాత్రమే మల్టీస్టారర్ చేస్తానని, కానీ అలా జరిగే అవకాశం లేదని చెప్పాడు. మల్టిస్టారర్ స్క్రిప్ట్ లతో ఇద్దరు ముగ్గురు తన దగ్గరకు వచ్చినా వాటిని నాగశౌర్య తిరస్కరించాడట. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై మూడో సినిమాను త్వరలో మొదలుపెడుతున్నామని తెలిపాడు. ఆ సినిమాతో రమణ తేజ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతాడని చెప్పాడు.