Begin typing your search above and press return to search.

నాగశౌర్యకు ఆమె దెబ్బ గట్టిగా తగిలినట్లుందే

By:  Tupaki Desk   |   25 Feb 2018 5:45 AM GMT
నాగశౌర్యకు ఆమె దెబ్బ గట్టిగా తగిలినట్లుందే
X
ఏదైనా ఆడియో వేడుక జరిగితే హీరోయిన్ మిస్సవడం కామనే కానీ.. హీరో మాత్రం మిస్సవడు. కానీ నిన్న జరిగిన ‘కణం’ ఆడియో వేడుకలో హీరో నాగశౌర్య కనిపించలేదు. అతడిని పిలవలేదా.. లేక శౌర్యకే వీలు కాక రాలేదా అన్నది తెలియడం లేదు. కొన్ని రోజుల కిందటే విడుదలైన తన సినిమా ‘ఛలో’ను శౌర్య ఎంత బాగా ప్రమోట్ చేసుకున్నాడో తెలిసిందే. ఆ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడు. కానీ ‘కణం’ విషయంలో మాత్రం అతడికి ఏమీ పట్టట్లేదు. అసలు ముందు నుంచి అతను ఎక్కడా ఈ సినిమా గురించి ప్రస్తావించట్లేదు. ‘ఛలో’ ప్రమోషన్ల టైంలో కూడా ఈ సినిమా ఊసే ఎత్తలేదు. ఇప్పుడు ‘కణం’ ఆడియో వేడుకలో శౌర్య కనిపించకపోవడంతో ఎక్కడో తేడా జరిగిందన్న అనుమానాలు బలపడ్డాయి.

ఇక్కడ ‘ఛలో’ ప్రమోషన్లలో భాగంగా ఒక టీవీ ఛానెల్ కార్యక్రమంలో జరిగిన పరిణామం గురించి మాట్లాడుకోవాలి. ఆ కార్యక్రమంలో ఒక గేమ్ ఆడాడు శౌర్య. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే కాకరకాయ తినాల్సి ఉంటుంది. అందులో ప్రశ్నలన్నీ ఇబ్బందికరంగానే ఉంటాయి. అందులో భాగంగా యాంకర్.. ‘‘మీ కెరీర్లో మోస్ట్ ఇరిటేటింగ్ కోస్టార్ ఎవరు’’ అని అడిగింది. మామూలుగా అయితే ఈ ప్రశ్నను శౌర్య దాటవేయాలి. కానీ అతను మాత్రం సాయిపల్లవి అంటూ ఠపీమని బదులిచ్చేశాడు. ఇలా ఒక కథానాయిక గురించి ఒక కథానాయకుడు టీవీ కార్యక్రమంలో చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టి సాయిపల్లవి ‘కణం’ షూటింగ్ సందర్భంగా శౌర్యను బాగానే ఇబ్బంది పెట్టిందన్న విషయం స్పష్టమవుతోంది. ‘కణం’ ఆడియో వేడుకలో శౌర్య లేకపోవడం ఈ సందేహాలు రూఢి అయిపోయాయి.