Begin typing your search above and press return to search.

ఐదు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసిన అక్కినేని హీరో!

By:  Tupaki Desk   |   19 Feb 2022 8:30 AM GMT
ఐదు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసిన అక్కినేని హీరో!
X
కరోనా ప్రభావం నుంచి ఇండస్ట్రీ తేరుకుంటోంది. ఈ సమయంలో లైన్లో పెట్టిన కథలను పట్టాలెక్కించడంలో హీరోలంతా బిజీగా ఉన్నారు. యువ హీరోలంతా వరుస ప్రాజెక్టులను సెట్ చేసుకుని, మిగతావారికి గట్టి పోటీని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సాధారణంగా చైతూ నిదానమే ప్రధానమన్నట్టుగా ఉంటాడు. ఒక సినిమా తరువాతనే మరో సినిమాను చేయడానికి ఇష్టపడుతుంటాడు. కానీ ఇకపై కూడా అలా ఉంటే కలవదు .. కుదరదు. అందువల్లనే ఇక స్పీడ్ పెంచే పనిలో పడ్డాడు. 'లవ్ స్టోరీ' .. 'బంగార్రాజు' సినిమాలతో హిట్ కొట్టేసిన చైతూ, త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో పలకరించనున్నాడు.

విక్రమ్ కుమార్ మంచి డైరెక్టర్ .. ఆయన సినిమాలు మిగతా సినిమాలకు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన ఎంచుకునే కథలు .. తెరపై వాటిని చెప్పే తీరు కొత్తగా ఉంటాయి. అందువలన ఈ సినిమా కోసం చాలా మంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముగింపు దశగా ఈ సినిమాను పరుగులు తీయిస్తూనే, ఐదు ప్రాజెక్టులను చైతూ లైన్లో పెట్టేశాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో ఒకటిగా 'నాంది' కనిపిస్తుంది. చాలా గ్యాప్ తరువాత 'అల్లరి' నరేశ్ కి హిట్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడలతో చైతూ ఒక సినిమా చేయనున్నాడు.

ఇక ఒక కథను ఎక్కడా బోర్ కొట్టకుండా పరుగులు తీయించే దర్శకురాలిగా నందినీ రెడ్డి కనిపిస్తుంది. గతంలో సమంతతో ఆమె చేసిన 'ఓ బేబీ'లో చివర్లో చైతూ ఒకసారి అలా మెరిశాడు. అలాంటి ఆమె దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ఇక లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను సమపాళ్లలో మిక్స్ చేసి, ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన కిశోర్ తిరుమలకి కూడా చైతూ ఓకే చెప్పేశాడు. తాజాగా కిశోర్ తిరుమల ఈ విషయాన్ని ధృవీకరించాడు కూడా. డీవీవీ దానయ్య నిర్మాణంలో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుండటం విశేషం.

ఇంతవరకూ లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన కథలను చేస్తూ వచ్చిన చైతూ, ఫస్టు టైమ్ తన కెరియర్లో 'టైమ్ ట్రావెల్'కి సంబంధించిన సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించనున్నాడు. రీసెంట్ గా ఆయన 'శ్యామ్ సింగ రాయ్'తో తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది తన కెరియర్లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చైతూ భావిస్తున్నాడు.

తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయడానికి కూడా చైతూ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల తమిళంలో హిట్ కొట్టిన 'మానాడు' సినిమాకి ఇది రీమేక్. అక్కడ శింబు హీరోగా చేయగా, ఆ పాత్ర కోసం ఇక్కడ చైతూను తీసుకున్నారు.

ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే ఎంపిక జరిగినట్టుగా చెప్పుకుంటున్నారు. మంచి బలమైన కంటెంట్ ఉన్న సినిమా కావడం వలన ఈ ప్రాజక్ట్ గురించి ఆలోచించవలసిన పనిలేదు. మరో వైపున పరశురామ్ తో అనుకున్న సబ్జెక్టు కూడా రెడీగానే ఉంది. ఇక్కడి నుంచే 'సర్కారువారి పాట'కు వెళ్లిన పరశురామ్, తిరిగి వచ్చిన తరువాత మళ్లీ దీనిని మొదలెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది మాత్రమే కాదు, వచ్చే ఏడాది కూడా చైతూ బిజీనే!