Begin typing your search above and press return to search.

పరశురామ్ - తరుణ్ భాస్కర్ సినిమాలపై నాగచైతన్య క్లారిటీ..!

By:  Tupaki Desk   |   20 July 2022 9:30 AM GMT
పరశురామ్ - తరుణ్ భాస్కర్ సినిమాలపై నాగచైతన్య క్లారిటీ..!
X
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'థాంక్యూ' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి నాలుగు వరుస హిట్స్ తర్వాత రాబోతున్న ఈ సినిమా విజయంపై అభిమానులు ధీమాగా ఉన్నారు.

చైతూ 'థాంక్యూ' సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందే 'దూత' వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు. అలానే 'లాల్ సింగ్ చద్దా' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. దీని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నారు. ఇదే క్రమంలో పరశురాం తో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇక తరుణ్ భాస్కర్ తో చై సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చై తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్న సినిమా తన స్టైల్లోనే సాగే మాస్ చిత్రం అవుతుందని నాగచైతన్య చెప్పారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తానని.. సినిమాలో 50 శాతం యాక్షన్ ఉంటుందని.. మాస్ యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునే ఫ్యాన్స్ ని ఇది కచ్చితంగా ఆకట్టుకుంటుందని చైతూ అన్నారు.

వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన 'మానాడు' తనకు బాగా నచ్చేసిందని.. రైట్స్ కు సంబంధించి సమస్యలు రావడంతో చేయలేకపోయానని చై తెలిపారు. దీని కంటే ముందు వెంకట్ ప్రభు చెప్పిన కథతోనే ఇప్పుడు సినిమా చేస్తున్నానని.. 'మానాడు' రీమేక్ మాత్రం ఇప్పుడు రానా చేతికొచ్చినట్లు చెప్పారు.

అలానే పరశురామ్ సినిమా గురించి మాట్లాడుతూ.. దర్శకుడు ఈమధ్యే కలిశాడు. కథ గురించి మాట్లాడుకున్నాం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమయ్యాక ఆ సినిమా ఎప్పుడనేది చెబుతామని నాగచైతన్య అన్నారు. ఇక తరుణ్ భాస్కర్ తో ఓ కథ చర్చల దశలో ఉందని అక్కినేని హీరో స్పష్టత ఇచ్చారు

నిజానికి నాగ చైతన్య - పరుశురామ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో చేయాల్సింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు కూడా. అయితే మధ్యలో పరశురామ్ కి మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమా చేసే అవకాశం రావడంతో చై మూవీ హోల్డ్ లో పడింది.

సర్కారు వారి తర్వాత సినిమా చైతన్య తోనే అని పరశురాం ఎప్పటి నుంచో చెబుతున్నారు.. కాకపోతే ఇప్పుడు వెంకట్ ప్రభుతో తెలుగు తమిళ బైలింగ్విల్ మాస్ మసాలా మూవీ కమిట్ అయ్యారు. వచ్చే ఏడాది మార్చి నాటికి సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

ఇకపోతే పరశురామ్ ఇంకా ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇవ్వలేదని నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. కథ సిద్ధమైన తర్వాతే ఎప్పుడనేది చెబుతారని వెల్లడించాడు. ఇందులో తనది డ్యూయెల్ రోల్ కాదని చెప్పారు. వెంకట్ ప్రభు సినిమా తర్వాత పరశురాం ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆలోపు తరుణ్ భాస్కర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరశురాం ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి రావచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.