Begin typing your search above and press return to search.

‘ఎవడే...’ డైరెక్టర్ తర్వాత సినిమా అదా?

By:  Tupaki Desk   |   29 Feb 2016 9:30 AM GMT
‘ఎవడే...’ డైరెక్టర్ తర్వాత సినిమా అదా?
X
ఎవడే సుబ్రమణ్యం లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు శేఖర్ కమ్ముల శిష్యుడు నాగ్ అశ్విన్. తొలి సినిమాతోనే దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నాడు, క్లాస్ ఆడియన్స్ మనసు దోచాడు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడాది అవుతున్నా.. అతడి తర్వాతి సినిమా ఏంటో ఇప్పటిదాకా ప్రకటించలేదు. దీనికి ఓ కారణం అతడి పెళ్లి కావడం. తన తొలి సినిమాను నిర్మించిన అశ్వనీదత్ కూతురు ప్రియాంకతోనే అశ్విన్ ప్రేమలో పడ్డాడు. ‘ఎవడే..’ సినిమా షూటింగ్ టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. సినిమా విజయవంతమైనట్లే.. వీరి ప్రేమ కూడా సక్సెస్ అయి గత ఏడాదే పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇప్పుడిక ఇద్దరూ కలిసి తమ తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఓ ఆశ్చర్యకరమైన సినిమాకు రెడీ అవుతున్నట్లు అశ్వనీదత్ వెల్లడించారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రియాంక నిర్మాణంలో నాగ్ అశ్విన్ సినిమా చేస్తాడని ప్రకటించారు అశ్వనీదత్. ఐతే సావిత్రి జీవిత కథ మీద వీళ్లకింత ఆసక్తి పుట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సావిత్రి జీవిత కథలో ఎన్నో మలుపులున్న సంగతి వాస్తవం. నటిగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు సావిత్రి. చివర్లో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొని దయనీయమైన స్థితిలో ప్రాణాలు వదిలారు. ఐతే ఇన్నేళ్లలో ఎవరికీ ఆమెపై సినిమా తీయాలనిపించలేదు. కానీ నాగ్ అశ్విన్ - ప్రియాంక మాత్రం ఆమెపై సినిమా చేయాలనుకోవడం ఆశ్చర్యకరమే.