Begin typing your search above and press return to search.

'మ్యూజిక్ స్కూల్' స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   27 July 2020 1:30 AM GMT
మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్...?
X
ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుసగా టాప్ హీరోస్ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. 'కిక్' సినిమాతో సంగీత ప్రపంచంలో కొత్త సౌండింగ్ కి నాంది పలికిన తమన్ అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సాంగ్స్ తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాకి తమన్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలు వచ్చి ఏడు నెలలు దాటిపోయినా వాటి సందడి మాత్రం ఆగడం లేదు. డబ్ స్మాష్ లతో టిక్ టాక్ వీడియోలతో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ పాటలకి బాలీవుడ్ సెలబ్రిటీలు విదేశీ క్రికెటర్స్ సైతం కాలు కదిపారంటే వాటి రీచ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టుకొని ఉన్నాడు థమన్.

ఇదిలా ఉండగా ఇటీవల తమన్ ఎప్పటికైనా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసే ఆలోచన ఉందని చెప్పుకొచ్చారట. అది తన డ్రీమ్ అని.. అయితే ఆ మ్యూజిక్ స్కూల్ డబ్బు సంపాదించడానికి కాకుండా సంగీతం మీద ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా సంగీతం నేర్పిస్తానని వెల్లడించారట. కాగా ఇప్పటికే నాని - సుధీర్ బాబు నటించిన 'వి' సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రానున్న 'మిస్ ఇండియా'కి సంగీతం సమకూర్చారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్'.. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'.. రవితేజ 'క్రాక్' చిత్రాలకి కూడా మ్యూజిక్ అందించాడు. అంతేకాకుండా బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా.. నాని 'టక్ జగదేశ్'.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట'కి కూడా తమన్ పాటలు అందించనున్నారు.