Begin typing your search above and press return to search.

పది నెలలు నాన్న నరకం చూశారు-సాయికిరణ్

By:  Tupaki Desk   |   17 July 2015 10:23 AM IST
పది నెలలు నాన్న నరకం చూశారు-సాయికిరణ్
X
ఎమ్మెస్ విశ్వనాథన్ తమిళుడే. కానీ తెలుగులోనూ అద్భుతమైన పాటలు అందించారు. ఆయన మరణం తెలుగు శ్రోతల్ని కూడా విషాదంలోకి నెట్టింది. ఐతే ఆ విషాదం నుంచి కోలుకోకముందే తెలుగు సంగీత ప్రియులు మరో దిగ్గజాన్ని కోల్పోయారు. ఘంటసాల తర్వాత అంతటి గంభీరమైన గాత్రంతో అద్భుతమైన పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల్ని మైమరచిపోయేలా చేసిన రామకృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రామకృష్ణ గత కొన్నేళ్లుగా బయటెక్కడా కనిపించట్లేదు. ఇంటిపట్టునే ఉంటున్నాడేమో అనుకున్నారు. ఐతే ఆయన ప్రాణాంతకమైన క్యాన్సరుతో పోరాడుతున్న సంగతి పరిశ్రమలో ఎవరికీ తెలియదు. ఐతే క్యాన్సర్ వల్ల తన తండ్రి నరకం చూశాడని వెల్లడించాడు సాయికిరణ్.

‘‘నాన్నకు క్యాన్సర్ మూడో దశలో ఉండటం వల్ల ఏమీ చేయలేకపోయాం. పది నెలలుగా ఆయన నరకం చూశారు. చికిత్స విషయంలో ఒమేగా హాస్పిటల్ వైద్యులు చాలా బాగా సహకరించారు. అయినా ఫలితం లేకపోయింది. నాన్న తరఫున నేను చెప్పేదొక్కటే. మా ఫ్యామిలీకి పరిశ్రమలో మంచి స్థానం ఇచ్చారు. చరిత్రలో నాన్నకు మంచి గాయకుడిగా, నాకు నటుడిగా అవకాశం ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమ. మా కుటుంబం తరఫున అందరికీ ధన్యవాదాలు. నాన్న గారి భక్తి పాటలు వింటే టెన్షన్ నుంచి రిలీఫ్ వచ్చేదని కొన్ని వేలమంది చెప్పగా విన్నాను. భక్తి పాటలు పాడటంలో ఘంటసాల గారి తర్వాత నాన్న గారే అని చాలామంది చెప్పారు. ఇంతకంటే గుర్తింపు ఏం కావాలి’’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పాడు సాయికిరణ్.