Begin typing your search above and press return to search.

పబ్ కేసుతో సంబంధం లేదని : గల్లా ఫ్యామిలీ క్లారిటీ

By:  Tupaki Desk   |   3 April 2022 8:13 AM GMT
పబ్ కేసుతో సంబంధం లేదని : గల్లా ఫ్యామిలీ క్లారిటీ
X
హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీ బయటపడింది. నగరంలోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్టు చెబుతున్నారు. ఫండింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడులు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు.

ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో డ్రగ్స్ తీసుకున్నవారు మాత్రమే ఉన్నారు. మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించినట్టు తెలిసింది. పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక,రాహుల్ సిప్లిగంజ్ సహా మిగతా వారికి నోటీసులు అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు.

ఈ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది సంచలనమైంది. వీరిలో సినీ, రాజకీయాలకు చెందిన ప్రముఖులు, వారి పిల్లల పేర్లు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో టీడీపీ ఎంపీ కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో గల్లా అశోక్ కూడా ఉన్నట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై గల్లా ఫ్యామిలీ స్పందించింది. పబ్ వివాదంతో గల్లా అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఒక మీడియా నోట్ ను గల్లా కుటుంబం విడుదల చేసింది.

''నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.'' అని గల్లా కుటుంబం ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.